ఒట్టావా, జూలై 18: రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందినవారిలో 40 శాతం మంది మరణానికి తీవ్ర రక్తస్రావమే కారణమని నివేదికలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే రక్తస్రావాన్ని ఆపగలిగితే ప్రతి 10 మంది బాధితుల్లో నలుగురి నుంచి ఐదుగురిని రక్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగాక.. కేవలం 20-45 సెకండ్లలో తీవ్ర రక్తస్రావాన్ని సైతం నిలువరించగల జిగురులాంటి ఔషధాన్ని కెనడా పరిశోధకులు అభివృద్ధి చేశారు. అత్యంత ప్రమాదకరమైన లాన్స్హెడ్ జాతి పాముల విషం నుంచి ఈ ఔషధాన్ని తయారుచేయడం గమనార్హం. ‘సూపర్ గ్లూ’గా పిలుస్తున్న ఈ ఔషధాన్ని గాయంపై వేసి, లేజర్ లైట్ లేదా సెల్ఫోన్లోని టార్చ్లైట్ వెలుతురును ప్రసరించేలా చేస్తే, రక్తస్రావాన్ని అడ్డుకునే కణజాలాన్ని ఉత్తేజితం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. లాన్స్హెడ్ పాముల విషంలో రక్తాన్ని గడ్డకట్టించే రెప్టలైజ్ (బ్యాట్రోక్సోబిన్) ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది.