కాబూల్: అహ్మద్ మస్సూద్ ( Ahmad Massoud ). ఈ పేరు వింటే తాలిబన్లకు వణుకు. 32 ఏళ్ల మస్సూద్.. పంజ్షీర్ దళానికి నాయకుడు. అతని కనుసన్నల్లోనే యాంటీ తాలిబన్ దళం రాటుదేలుతోంది. 1980, 1990 దశకంలో సోవియట్ రష్యా, తాలిబన్లకు చుక్కలు చూపించిన అహ్మద్ షా మస్సూద్ కుమారుడే ఈయన. ప్రస్తుతం తాలిబన్ల చెరలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో.. ఆ ఉగ్రవాదులకు కొరకాని కొయ్యగా మారింది పంజ్షీర్ లోయ ప్రాంతం. కాబూల్కు ఉత్తరం దిక్కున్న 30 మైళ్ల దూరంలో ఉన్న పంజ్షీర్ ప్రాంతం ఇప్పుడో ప్రావిన్సు. వాస్తవానికి ఒకప్పుడు అది జిల్లా. కానీ గడిచిన దశాబ్ధాల్లో ఆ ప్రాంతం ఎదిగిన తీరు అనిర్వచనీయం. ఆయుధాలతో విర్రవీగితున్న తాలిబన్లకు పలుమార్లు చెక్ పెట్టింది ఆ సుందర ప్రదేశమే. ఆకర్షణీయమైన లోయలతో ఆకట్టుకునే ఆ ప్రకృతి ప్రదేశంలో యాంటీ తాలిబన్ దళాన్ని నడుపుతోంది అహ్మద్ మస్సౌద్. పరాజయం ఎరుగని ప్రాంతంగా నిలుస్తోంది.
మస్సూద్ తండ్రి కూడా తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆ సమయం నుంచే పంజ్షీర్ ప్రజలు ఆయుధాలు సమీకరిస్తూ వస్తున్నారు. ఇలాంటి రోజు వస్తుందనే తాము ఆయుధాలను సేకరించినట్లు అహ్మద్ మస్సూద్ ఇటీవల ఓ మీడియాతో తెలిపారు. అహ్మద్ షా మస్సూద్ను లయన్ ఆఫ్ పంజ్షీర్గా పిలుస్తారు. నిజానికి పంజ్షీర్ అంటే అయిదు సింహాలని అర్థం. కమాండర్గా ఉన్న షా మస్సూద్.. అప్పట్లో సోవియ్, తాలిబన్ దళాలకు ముచ్చెమటలు పట్టించాడు.
ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఆర్మీ జనరల్ కుమారుడే అహ్మద్ షా మస్సూద్. అతను పంజ్షీర్ లోయలోనే పుట్టాడు. ఆ ప్రావిన్సులో ఇప్పటికీ షా చిత్రాలు కనిపిస్తుంటాయి. షా మస్సూద్ వల్లే పంజ్షీర్.. యాంటీ కమ్యూనిస్టు కేంద్రంగా వర్ధిల్లింది. 1978లో పీడీపీఏ అధికారంలో ఉన్న సమయంలో.. సోవియట్ దళాలకు వ్యతిరేకంగా పంజ్షీర్ ప్రజలు పోరాటం చేశారు. సోవియట్- ఆఫ్ఘన్ యుద్ధంలో అతను రెబల్ హీరో అయ్యాడు. షా మస్సూద్ విద్యావేత్త. అతను ఫ్రెంచ్ కూడా మాట్లాడేవాడు. అయితే 2001లో ఆల్ఖయిదా గ్రూపు షా మస్సూద్ను హతమార్చింది. అమెరికాపై జరిగిన సెప్టెంబర్ లెవన్ దాడులకు రెండు రోజుల ముందే షా మస్సూద్ను చంపేశారు. అతనో జాతీయ హీరో అంటూ అప్పట్లో అధ్యక్షుడు హమీద్ ఖర్జాయ్ కూడా ప్రకటించారు. కానీ కొందరు అతన్ని యుద్ధ నేరస్థుడిగా పరిగణిస్తారు.
1980 నుంచి 1985 మధ్య సోవియట్ దళాలు అనేక సార్లు పంజ్షీర్పై దాడి చేశాయి. కంచుకోటలా ఉన్న పంజ్షీర్ను సోవియేట్ దళాలు ఏమీ చేయలేకపోయాయి. డజన్ల సంఖ్యలో దాడులు జరిగినా.. ఆ లోయ మాత్రం చెక్కుచెదరలేదు. అక్కడ ఉన్న పర్వతశ్రేణులను అర్థం చేసుకోలేని రష్యన్ ఫైటర్లు ఎంతో మంది నేలకూలారు. పంజ్షీర్ యోధులు చేసిన దాడుల్లో రష్యన్లు కకావికలం అయ్యారు. అన్ని వైపుల నుంచి ఆ నాటి సోవియేట్ దళాలకు ఎదురుదెబ్బలు తగిలాయి. వేలాది మంది రష్యా సైనికులు గాయాలపాలయ్యారు.
ప్రస్తుతం పంజ్షీర్లోని యాంటీ తాలిబన్ దళాలు మరింత రాటుదేలాయి. వాళ్లంతా ఇప్పుడు కొత్త టెక్నిక్లను నేర్చుకున్నారు. ఎటువంటి కమ్యునికేషన్ లేకున్నా శత్రువును ఎలా అంతం చేయాలో వాళ్లు తెలుసుకున్నారు. సోవియేట్ దళాలు వదిలేసిన ఆయుధాలు, ట్యాంక్లు, విమానాలు ఇంకా అక్కడే ఉన్నాయి. అవన్నీ తుక్కుపట్టిపోయాయి. పంజ్షీర్లో దళాధినేతగా ఉన్న అహ్మద్ మస్సూద్ 12 ఏళ్లు ఉన్న సమయంలో అతని తండ్రి మరణించారు. యువ అహ్మద్ మస్సూద్ లండన్లో చదువుకున్నాడు. అక్కడి రాయల్ మిలిటరీ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ కూడా పొందాడు.
తండ్రి తరహాలో అనుభవం లేకున్నా.. ప్రస్తుతం అహ్మద్ మస్సూద్ మాత్రం యాంటీ తాలిబన్ దళాల్ని బలోపేతం చేశారు. తాలిబన్లను ధీటుగా ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేశారు. కానీ శత్రుదుర్భేద్యమైన పంజ్షీర్పై తాలిబన్లు ఒకేసారి దాడి చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. ఆ లోయలో పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అంచనా వేయలేమని కొందరు నిపుణులు అంటున్నారు. తాలిబన్లు పెద్ద పెద్ద పట్టణాలను స్వాధీనం చేసుకుంటున్నారు. సరుకుల రవాణాకూ బ్రేక్ పడింది. అయితే ఇలాంటి సమయంలో పంజ్షీర్ ఎలా పంజా విసురుతుందో చూడాల్సిందే. పాశ్చాత్య దేశాలు అందించే సహకారం మీదే పంజ్షీర్ భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్లు తాజాగా ఓ మీడియాతో అహ్మద్ చెప్పారు.