లండన్: తమ దేశానికి వచ్చే భారత ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనల విషయంలో బ్రిటన్ కొత్త నాటకానికి తెరలేపింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ టీకాను ఆమోదించిన వ్యాక్సిన్ల జాబితాలో చేర్చిన బ్రిటన్.. ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనల విషయంలో సడలింపులనిచ్చిన 17 దేశాల జాబితాలో మాత్రం భారత్ను చేర్చలేదు. భారత ప్రభుత్వం జారీచేస్తున్న టీకా ధ్రువపత్రంలో కొన్ని సమస్యలు ఉండటంతోనే భారత్ను జాబితాలో చేర్చలేదని బ్రిటన్ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో కొవిషీల్డ్ టీకా సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలు లేవన్నారు. కాగా బ్రిటన్ తాజా నిర్ణయంతో కొవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్న భారతీయులు.. బ్రిటన్కు వెళ్లాక క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది.
సర్టిఫికేట్లలో సమస్యేం లేదు: ఎన్హెచ్ఏ
భారతప్రభుత్వం జారీ చేస్తున్న టీకా ధ్రువపత్రంలో సమస్యలున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం లేవనెత్తిన అనుమానాలపై జాతీయ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) సీఈవో ఆర్ఎస్ శర్మ స్పందించారు. కొవిన్ యాప్, పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న టీకా ధ్రువపత్రాల్లో ఎలాంటి సమస్యలులేవని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాలకు అనుగుణంగా కొవిన్ వ్యవస్థ ఉందన్నారు.
వివాదమేంటి?
వచ్చేనెల 4వ తేదీ నుంచి విదేశీ ప్రయాణికులకు అమలు చేసే కొవిడ్ నిబంధలను బ్రిటన్ గతవారం ప్రకటించింది. వాటి ప్రకారం.. కొవిషీల్డ్ టీకా వేసుకున్నప్పటికీ, భారతీయులు బ్రిటన్లో పది రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు వివక్షాపూరితంగా ఉన్నాయంటూ భారత్ మండిపడింది. ఈ క్రమంలోనే ఆమోదించిన టీకాల జాబితాలో కొవిషీల్డ్ను బ్రిటన్ చేర్చింది. కానీ టీకా ధ్రువపత్రాల్లో సమస్యలు ఉన్నాయంటూ తిరకాసు పెట్టింది.