విజయనగరం : కరోనా వైరస్ ప్రతీ కుటుంబంలోనూ విషాదాన్ని నింపుతుంది. ప్రతీ కుటుంబంలో ఒకరు కరోనా బారిన పడుతున్నారు. కొందరు కరోనా నుంచి కోలుకుంటుంటే.. కొందరేమో బలవుతున్నారు. కరోనా బారిన పడ్డ ఇద్దరు వృద్ధ దంపతులు కరోనాతో ఒకే సమయంలో మృతి చెందారు. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో చోటు చేసుకుంది. ఈ ఇద్దరు వృద్ధ దంపతులకు ఇటీవలే కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకే సమయంలో కన్నుమూశారు. దీంతో ఆ దంపతుల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం వరకు కొత్తగా 11,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19 కారణంగా 37 మంది మృత్యువాతపడ్డారు. 4,421 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల సంఖ్య 10,20,926 చేరింది, మొత్తం మరణాలు 7616. యాక్టివ్ కేసులు 81,471.
జిల్లాల వారీగా తూర్పు గోదావరి, నెల్లూరులో ఆరుగురు, అనంతపూర్, చిత్తూర్లో నలుగురు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, గుంటూరు, కృష్ణ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో ఇద్దరు, ప్రకాశం ఒక్కరు చొప్పున మరణించారు.