డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు
పేదలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయడమే లక్ష్యం
ఇప్పటికే కొండాపూర్లోని జిల్లా, వనస్థలిపురం ఏరియా దవాఖానల్లో సేవలు షురూ
త్వరలో శంషాబాద్ ప్రభుత్వ దవాఖానలో..
వికారాబాద్లో డయాగ్నోస్టిక్ హబ్ (డీ-హబ్) ఏర్పాటుకు శ్రీకారం
చేరుకున్న ఆధునిక యంత్రాలు.. వచ్చే నెలలో ప్రారంభించేందుకు కసరత్తు
అందుబాటులో 57 రకాల వైద్య పరీక్షలు
వికారాబాద్/ రంగారెడ్డి మార్చి 26, (నమస్తే తెలంగాణ): వైద్య పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారించడం, సరైన మందులతో దానిని నియంత్రించడం, మరింతగా వ్యాప్తి చెందకుండా నివారించడం.. అనే లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేసి పేదలపై ఆర్థికభారాన్ని తగ్గించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందుకోసం ఖరీదైన యంత్రాలతో ప్రభుత్వ దవాఖానల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నది. యంత్రాలు ఇప్పటికే వికారాబాద్కు చేరుకోగా తొందరలో వైద్య పరీక్షలను ప్రారంభించేందుకు జిల్లా వైద్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్, వనస్థలిపురం దవాఖానల్లో ఇప్పటికే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా.. శంషాబాద్లోనూ మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. త్వరలో ఇక్కడ సేవలను ప్రారంభించనున్నారు. ఈ సెంటర్లలో సాధారణ రక్త పరీక్షల నుంచి సీటీ స్కాన్ వరకు 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయనున్నారు. రోగ నిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు వెళ్తున్న పేదలకు ఆర్థికభారం తడిసి మోపెడవుతున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా డయాగ్నోస్టిక్ హబ్ (డీ-హబ్) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 24 గంట లు పనిచేసే డయాగ్నోస్టిక్ హబ్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చే నెల మొదటివారంలో ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ దవాఖానకు ప్రతి రోజు 300 నుంచి 600 మంది వరకు ఔట్ పేషంట్లు వస్తారు. సీజనల్ వ్యాధులతో అదనంగా 300 మంది వరకు వస్తుంటారు. సాధారణ రక్త పరీక్షల నుంచి సిటీ స్కాన్ వరకు ఆయా రోగులకు రోగ నిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు వెళుతున్నారు. ఈ ఖర్చులు పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారాయి.ఈ పరిస్థితులను గుర్తించి దీంతో అన్ని పరీక్షలు ఒకే చోట నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీ-హబ్ పేరిట రోగ నిర్ధారణ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లా కేంద్రం లో ఉన్న ప్రభుత్వ దవాఖానకు వస్తున్న రోగులకు 57 రకాల రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేపట్టానున్నారు.
తనిఖీ చేసిన కలెక్టర్ ..
ఇక్కడ ఏర్పాటు చేయనున్న డీ-హబ్ను కలెక్టర్ పౌసుమిబసు ఇప్పటికే రెండు దఫాలు తనిఖీ చేశారు. వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు వచ్చిన కొత్త ఆధునాతన టెస్టింగ్ పరికరాలను అమర్చి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని వైద్య అధికారులను ఆదేశాలు జారీ చేశారు. టెస్టింగ్ యం త్రాలకు అసవరమైన విద్యుత్ సదుపాయాలు వెంటనే కల్పించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి జిల్లా కొండాపూర్లోని జిల్లా ఆసుపత్రితోపాటు వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్ కేంద్రాలుండడంతో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగానే నిర్వహిస్తున్నారు. తాజాగా జిల్లాలోని శంషాబా ద్ ప్రభుత్వాసుపత్రిలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి పాదించారు. ఒకటి లేదా రెండు మాసాల్లో ఇక్కడ అందుబాటులోకి రా నుంది. కొండాపూర్, వనస్థలిపురం ఆసుపత్రుల్లోని డయాగ్నోస్టిక్ కేంద్రాలతో పట్టణ ప్రాంతంలోని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు కొనసాగుతుండగా, శంషాబాద్ ప్రభుత్వాసుపత్రిలో డయాగ్నోస్టిక్ కేంద్రం అందుబాటులోకి వచ్చినట్లయితే చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గంలోని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉచితంగా చేసే పరీక్షలు ఇవే..
హిమోగ్లోబిన్(హెచ్బీ), టీఎల్సీ, డీఎల్సీ, ఎంపీ(ైస్లెడ్), ఈఎస్ఆర్, పీబీఎఫ్, సీబీసీ, బ్లడ్ గ్రూప్, టీఈసీ, ప్లేట్లేట్, పీసీవీ, కూంబ్స్, ప్రోథ్రోంబిస్,స్పెర్మ్కౌంట్, బ్లడ్షుగర్,బ్లడ్ యూరియా, ఎస్జీవోటీ, ఎస్జీఓటీ, ఎస్జీపీటీ, ఆల్కలైన్ ఫాస్పేట్స్, టోటల్ ప్రొటీన్, కాల్షియం, పొటాషియం, సోడి యం, ట్రోపొటీన్ ఐ,అల్బుమిన్, పొటాషియం, పోడి యం, ట్రోపోనిన్ టీ, ఎల్డీహెచ్,ఎస్ ఎల్డీహెచ్, అమి లెస్, యూరిక్ యాసిడ్,టోటల్ కోలెస్ట్రాల్, ట్రైగ్లిసెరైడ్, వీఎల్డీఎల్, హెచ్డీఎల్,టీఎస్హెచ్, ఆర్పీఆర్,హెచ్ఐవీ, స్పూటమ్(ఏఎఫ్బీ), డెంగీ, మలేరియా, ఆర్ఏ, ఓఏఎస్ ఎల్వో, సీఆర్పీ,బ్లడ్ కల్చర్,యూరిన్ కల్చర్, హిస్టో పాథా లజీ బయాప్సీ,బోన్మారో ఆస్పిరేషన్, యూరిన్ కంప్లీట్, యూరిన్ ప్రెగ్నెన్సీ,యూరిన్ మైక్రోస్కోపీ, ఓవీఏ అండ్ సిస్ట్, ఎక్స్రే,యూఎస్జీ, ఈసీజీ ఇలాంటి 57 రకాల పరీక్షలు ఇక్కడ చేయనున్నారు.
త్వరలోనే డ్రైరన్ నిర్వహిస్తాం
వచ్చే నెల జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానుంది. జిల్లాలో నాలుగు రూట్లు ఏర్పాటు చేశాం. మొత్తం 34 ఫోక్స్ నుంచి ఇక్కడి పరీక్షలకు తీసుకువస్తారు. ఇందుకు సంబంధించి నాలుగు వాహ నా లను ఏర్పాటు చేయబోతున్నాం. తెలంగాణ స్టేట్ డయాగ్నోస్టిక్ హబ్ (డీ-హబ్) రాష్ట్ర నోడల్ అధికారి నందిత, డాక్టర్ ప్రసాద్లు శుక్రవా రం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పౌసుమి బసును కలిశామని వెల్లడించారు. పూర్తి స్థాయి లో డీ-హబ్ అధునాతన టెస్టింగ్ పరికరాలు వచ్చాయి. అన్నీ కూడా సెన్సిటివ్ యంత్రాలు. ఈ డీ-హబ్లో 57 రకాల పరీక్షలే కాకుండా..ఇంకా రేడియోలజీకి సంబంధించిన సిటీ స్కాన్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అడ్వాన్స్ ఈసీజీ కూడా చేయబోతున్నాం. ఇందుకు సంబంధించి 3వేల ఎస్ఎప్టీ స్థలం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ దవాఖానకు పాత విద్యుత్ వైర్లు ఉన్నాయి, వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త వైర్లు బిగించిన వెంటనే డీ-హబ్ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 5వ తేదీలోపు డ్రైరన్ నిర్వహించాలని ఆదేశాలు ఉన్నాయి. ఆ లోపు ఈ పనులన్నీ పూర్తి చేస్తాం.
-డాక్టర్ బిజిలిల్, డీ-హబ్ ప్రోగ్రాం ఆఫీసర్, వికారాబాద్ జిల్లా