న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగినా గత వారం రోజుల్లో రూ.2000పైగా తగ్గాయి. ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.250 పెరిగి రూ.46,277కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,027 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ కాస్త బలహీన పడటమే దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అయితే, హైదారాబాద్లో మాత్రం 24 క్యారట్ బంగారం ధర రూ.100 తగ్గి రూ.47,890కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,990 వద్ద ముగిసింది. ఇక 22 క్యారట్ బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.90 తగ్గి రూ.43,900కి దిగివచ్చింది. ఇక వెండి ధర ఢిల్లీలో రూ.258 పెరిగి రూ.66,842కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,584 వద్ద ముగిసింది.