న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆయన భార్య మిలిండా గేట్స్ విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. 27 ఏళ్ల వివాహ బంధానికి ఆ ఇద్దరూ ఇటీవలే బ్రేకప్ చెప్పారు. అయితే అనేక దేశాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్న 50 బిలియన్ డాలర్ల విలువైన గేట్స్ ఫౌండేషన్ సంస్థలో మార్పు ఉండదని తొలుత ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ అంశంలో కొత్త ట్విస్ట్ మొదలైనట్లు తెలుస్తోంది. గేట్స్ ఫౌండేషన్లో నాయకత్వ మార్పులు చేయాలని బిల్, మిలిండా గేట్స్ భావిస్తున్నట్లు ఓ పత్రిక కథనం రాసింది. గేట్స్ ఫౌండేషన్కు సీఈవోగా ఉన్న మార్క్ సుజ్మాన్ ఈ విషయాన్ని చెప్పారు. ఫౌండేషన్ ఉద్యోగులతో మాట్లాడిన మార్క్.. బిల్, మిలిండాలతో సంస్థ గురించి చర్చించినట్లు తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సురక్షితమైన భవిష్యత్తును ఉద్దేశించి చర్యలు ఉంటాయన్నారు.
గేట్స్ ఫౌండేషన్ బోర్డులో సభ్యుడైన మరో సంపన్నుడు వారెన్ బఫెట్తోనూ ఈ అంశాన్ని చర్చిస్తున్నట్లు వెల్లడించారు. గేట్స్ ఫౌండేషన్ మరింత పారదర్శకంగా, ఇండిపెండెంట్గా పనిచేసేందుకు వీలుగా తయారు చేయాలని బిల్, మిలిండాలు భావిస్తున్నారు. బోర్డులో బయటి ఇన్వెస్టర్లను కూడా జోడించాలని అనుకుంటున్నట్లు సమీప వ్యక్తులు తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ వ్యవహారాలన్నీ సుజ్మాన్ చూసుకుంటారు. బిల్, మెలిండాలు కో-చైర్మన్లు, ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. ఫౌండేషన్ చేపట్టే కార్యక్రమాలన్నింటినీ సుజ్మాన్ సూపర్వైజ్ చేస్తారు. వారెన్ బఫెట్ కూడా ఈ ఫౌండేషన్లో ట్రస్టీగా ఉన్నారు. ప్రస్తుతం కోవిడ్ వేళ ప్రపంచ వ్యాప్తంగా గేట్స్ ఫౌండేషన్ మిలియన్ డాలర్ల సాయం చేస్తోంది.