సత్ఫలితాలనిస్తున్న రాష్ట్ర సర్కారు ముందుచూపు
ఇంటింటికీ వెళ్లి బాధితులను గుర్తించి మందుల అందజేత
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6208,
ములుగులో 2305 మందికి లక్షణాలు
4483 మందికి కరోనా కిట్ల పంపిణీ
తగ్గుతున్న కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య
జయశంకర్ భూపాలపల్లి/ములుగు, మే 16(నమస్తేతెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే కొవిడ్ కట్టడికి దోహదం చేస్తున్నది. కరోనా లక్షణాలను గుర్తించడంతో వైరస్ వ్యాప్తి నివారణ సులువవుతున్నది. సర్వే బృందం సభ్యులు ఇంటింటికీ తిరుగుతూ జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించారు. వారికి ఉచితంగా మందులతో కూడిన మెడికల్ కిట్లను అందించా రు. సేకరించిన సెల్ నంబర్ల ద్వారా గ్రామంలోని ఆరోగ్య కార్యకర్తలు లక్షణాలతో బాధపడే వారితోపాటు వారి కుటుంబసభ్యుల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
సత్ఫలితాలనిస్తున్న రాష్ట్ర సర్కారు ముందుచూపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..
జిల్లాలోని 11 మండలాల్లోని 241 గ్రామ పంచాయతీల్లో 374 బృందాలు 88,765 ఇండ్లను సర్వే చే శాయి. ఇందులో 6208 మందికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు బృంద సభ్యులు గుర్తించారు. 2155 మందికి కరోనా కిట్లను అందించారు. వారు హోం క్వారంటైన్లో ఉండి 5 రోజులపాటు మందులు వాడాలని సూచించారు. ఆ తర్వాత వైరస్ లక్షణాలు తగ్గకుంటే తదుపరి చికిత్సలకు తరలించే ఏర్పాట్లు చేస్తారు.