మిన్స్క్: జర్నలిస్టు రోమన్ ప్రోటాసేవిచ్ అరెస్టును బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో సమర్థించుకున్నారు. ఏథెన్స్ నుంచి లుథివేనియాకు వెళ్తున్న ర్యాన్ఎయిర్ విమానాన్ని దారిమళ్లించి.. అందులో ప్రయాణిస్తున్న 26 ఏళ్ల జర్నలిస్టు ప్రోటాసేవిచ్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల ప్రపంచ దేశాలు విస్మయం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో బెలారస్ అధ్యక్షుడు స్పందించారు. పార్లమెంట్లో మాట్లాడుతూ విమర్శకులు మన దేశంపై యుద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. హైబ్రిడ్ యుద్ధానిని పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నట్లు అధ్యక్షుడు లుకాషెంకో ఆరోపించారు. అనేక దేశాలు తమపై ఆంక్షలు విధించినట్లు చెప్పారు. ర్యాన్ఎయిర్ విమానాన్ని హైజాక్ చేసి జర్నలిస్టును అరెస్టు చేసిన సంఘటనను ఆయన సమర్థించుకున్నారు. జర్నలిస్టు ప్రోటాసేవిచ్ గత కొన్నేళ్ల నుంచి అధ్యక్షుడు లుకాషెంకోకు వ్యతిరేకంగా ఆన్లైన్ ప్రచారం నిర్వహిస్తున్నాడు. అతనికి సహకరిస్తున్న గర్ల్ఫ్రెండ్ సోఫియాను కూడా అరెస్టు చేశారు. ఆ ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.