బస్తర్ (ఛత్తీస్గఢ్), ఏప్రిల్ 21: మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాలన్న నిర్ణయంలో భాగంగా ప్రభుత్వ భద్రతా దళాలు కొత్త కూంబింగ్ వ్యూహాలను అమలుచేస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోని దక్షిణ బస్తర్ అడవుల్లో ఉన్న నక్సలైట్ల క్యాంపులపై భద్రతాదళాలు డ్రోన్ల సాయంతో దాడులు జరిపినట్లు సమాచారం. బీజాపూర్ జిల్లాలోని బోతాలంక, పాలగూడెం మధ్య ప్రాంతంలో ఉన్న తమ శిబిరాలపై సోమవారం వేకువజామున 3 గంటల సమయంలో ఈ దాడులు జరిగినట్టు మావోయిస్టు పార్టీకి చెందిన ‘దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ’ (డీకేఎస్జడ్సీ) ప్రతినిధి వికల్ప్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల మొదటి వారంలో భద్రతా దళాలపై మావోయిస్టుల సాయుధదళం ‘పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ’ (పీఎల్జీఏ) జరిపిన దాడుల్లో 22 మంది జవాన్లు మరణించడం తెలిసిందే. ఆ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే భద్రతా దళాలు డ్రోన్లతో విరుచుకుపడ్డాయని వికల్ప్ ఆరోపించారు. అయితే, ఈ దాడుల్లో ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? లేదా? అనే విషయం తెలియరాలేదు. కాగా, డ్రోన్ల సాయంతో దాడులు జరుపటం గురించి తమకు తెలియదని ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాలు పేర్కొనడం గమనార్హం. అయితే, సోమవారం వేకువజామున భద్రతా దళాలు.. మావోయిస్టుల కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగించాయని, దీంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వారు పారిపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి.