అనారోగ్యంతో హస్తకళా తపస్వీ కన్నుమూత..
తన కళాఖండాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు
2015లో శిల్పిగురు అవార్డుతో పేరుప్రఖ్యాతలు
ఉమ్మడి జిల్లా కళాకారుల సంతాపం
కెరమెరి, ఏప్రిల్ 21: మండలంలోని కెస్లాగూడ గ్రామానికి చెందిన నానేశ్వర్ (71)అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనను, కుటుంబసభ్యులు కెరమెరి దవాఖానకు తరలించారు. సిబ్బంది వైద్యం అందిస్తుండగా, బుధవారం సాయంత్రం మృతి చెందారు. రక్తపోటు అధికమై నానేశ్వర్ మృతి చెందినట్లు వైద్యాధికారి సుంకన్న పేర్కొన్నారు. కాగా, నానేశ్వర్కు భార్య, ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.
శిల్పిగురుగా పేరు గాంచి..
హస్తకళా నైపుణ్యంతో నానేశ్వర్ అందరి చేత మెప్పుపొందాడు. ఇత్తడితో వివిధ రకాల కళఖండాలను తయారు చేసి ఆణిముత్యంగా నిలిచారు. ఆదివాసుల సంప్రదాయ ప్రాచీన కళావృత్తులు, ఇంటి అలంకరణ వస్తువులు తయారు చేసి గుర్తింపు పొందారు. ఆదివాసుల దేవతా మూర్తు లు, ఇతర సంప్రదాయ వస్తువుల తయారీకే పరిమితమైన తరుణంలో లేపాక్షి సంస్థ ద్వారా 1982 లో ప్రత్యేక శిక్షణ పొందారు. దీంతో అవసరమైన అలంకార వస్తువులను తయారు చేసి, బాహ్యప్రపంచంలో ప్రజలకు తెలిసేలా మార్కెట్లోకి ప్రవేశ పెట్టారు. ఇత్తడి, మట్టి, మైనం ముడి సరుకులతో ఆకర్షణీయ వస్తువులను తయారు చేయడంతో ప్రత్యేక గుర్తింపు లభించింది. మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల కంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం కెస్లాగూడ గ్రామ హస్తకళకారులపైనే అందరి దృష్టి పడేలా చేశాడు. వరంగల్లోని డీసీసీ హ్యాండీక్రాఫ్ట్ డైరెక్టర్ దివ్య ప్రతిపాదన మేరకు 2013-14 సంవత్సరంలో శిల్పిగురు కింద కోవ నానేశ్వర్ను ఎంపిక చేయ గా, 2015 డిసెంబర్ 9న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేతులమీదుగా ఢిల్లీలో అవార్డును స్వీకరించారు. జీవన భృతి కోసం సంప్రదాయ కళను కొనసాగించిన ఆయన, నేటి పోటీ యుగంలోనూ తన కళను వీడలేదు. ఓజీలు తయారు చేసిన కళాఖండాలను జాతీయ స్థాయిలోనూ విక్రయించే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. వారసత్వంగా వచ్చిన ఈ హస్తకళకు, ఆధునిక మెరుగులు జోడించి మారుతున్న కాలానికి అనుగుణంగా కళారూపాలను తయారు చేసి మన్ననలు పొందుతున్న ఆదివాసీ ఓజీ తెగకు చెందిన కోవ నానేశ్వర్ అకాల మరణంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కళాకారులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.