మాస్కో: సుమారు 24 వేల ఏండ్ల క్రితం గడ్డకట్టుకుపోయిన ఓ సూక్ష్మజీవిని రష్యా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దానిపై లోతుగా పరిశోధనలు చేయగా, అది బతికే ఉన్నట్టు తేలడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఈ అరుదైన ఘటన సైబీరియాలో జరిగింది. డెల్లాయిడ్ రోటిఫర్ అనే బహుకణ సూక్ష్మజీవి మంచినీటిలో జీవిస్తుంది. అత్యంత శీతలమైన పరిస్థితుల్లో.. ఆక్సిజన్, ఆహారం, నీరు లేకపోయినప్పటికీ ఈ జీవి దశాబ్దాలపాటు బతుకగలదు. సైబీరియా సమీపంలోని అలాజెయా నదిలో పరిశోధనల నిమిత్తం అక్కడి మట్టి అవశేషాలను శాస్త్రవేత్తలు సేకరించారు. అవి 23,960 నుంచి 24,485 ఏండ్ల క్రితంనాటివిగా నిర్ధారించారు. ఆ నమూనాలను విశ్లేషించగా అందులో ‘డెల్లాయిడ్ రోటిఫర్’ జీవి ఉన్నట్టు గుర్తించారు. తొలుత అది శిలాజం అని భ్రమపడిన శాస్త్రవేత్తలు లోతుగా పరీక్షలు జరుపగా.. అది ఇంకా ప్రాణాలతో ఉన్నట్టు గమనించారు. బహుకణ జీవి వేల ఏండ్లపాటు శీతల వాతావరణంలో ప్రాణాలతో ఉండటం అరుదైన విషయమని చెప్పారు. సంపర్కంలో పాల్గొనకుండానే ఈ జీవులు సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయన్నారు.