కాబూల్, సెప్టెంబర్ 3: అఫ్గానిస్థాన్లో తాలిబన్ల ప్రభుత్వం శనివారం ఏర్పాటు కానున్నది. ప్రభుత్వాధినేతగా తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా బరాదర్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని తాలిబన్ సీనియర్ నేత జబియుల్లా ముజాహిద్ శుక్రవారం వెల్లడించాడు. బరాదర్ ఇప్పటివరకు దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయం చైర్మన్గా ఉన్నాడు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి తాలిబన్ అగ్రనేత హైబతుల్లా అఖూంజాదా నేతృత్వం వహిస్తాడని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఆయన ముస్లిం సంప్రదాయాలకు అనుగుణంగా పరిపాలన జరిగేలా పర్యవేక్షిస్తారని తెలుస్తున్నది. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు యాకూబ్, భారత రాయబారి దీపక్ మిత్తల్తో చర్చలు జరిపిన షేర్ మహ్మద్ స్తానిక్జాయ్లకు తాలిబన్ ప్రభుత్వంలో కీలక పదవులు దక్కనున్నట్టు తెలుస్తున్నది. శుక్రవారమే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, ప్రార్థనల అనంతరం ప్రకటన ఉంటుందని తాలిబన్ నేతలు రెండుమూడు రోజులుగా చెప్పుకొచ్చారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటును ఒకరోజు వాయిదా వేసినట్టు జబియుల్లా ముజాహిద్ తెలిపాడు.
ముల్లా ఒమర్తో కలిసి..
అఫ్గానిస్థాన్లోని ఉర్జాన్ ప్రావిన్స్లో 1968లో బరాదర్ దుర్రానీ పష్తూన్ తెగలో జన్మించాడు. కాందహార్లో పెరిగాడు. 1970ల్లో సోవియట్ ఆక్రమణ తర్వాత తిరుగుబాటు బృందంలో చేరాడు. సోవియట్ సేనలు అఫ్గాన్ నుంచి వెళ్లాక దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు తలెత్తాయి. దీంతో ముల్లా ఒమర్తో కలిసి ‘తాలిబన్’ను స్థాపించాడు. ఆ తర్వాత అఫ్గానిస్థాన్లో 1996-2001 వరకు తాలిబన్ల పాలన సాగింది. అమెరికా దాడుల సమయంలో బరాదర్ పారిపోయాడు. 2010లో బరాదర్ను కరాచీలో అరెస్టు చేశారు. 2018లో విడుదలయ్యాడు. తాలిబన్ ప్రతినిధిగా బరాదర్ వివిధ దేశాల నాయకులతో చర్చలు జరిపారు.
కశ్మీర్ ముస్లింల కోసం గళమెత్తుతాం
ఇస్లామాబాద్: భారత్తో సత్సంబంధాలు కోరుకొంటున్నాం అని ఓ వైపు చెప్తూనే కశ్మీర్ విషయంలో వంకర కూతలు కూస్తున్నారు తాలిబన్లు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింల కోసం గళం విప్పే హక్కు తమకు ఉందని, అది కశ్మీర్లో ఉన్న ముస్లింల గురించి కూడా కావొచ్చని తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ అన్నారు. ‘ముస్లింలు మీ దేశ పౌరులే. మీ దేశ పౌరులకు మీ చట్టాల ప్రకారం సమాన హక్కులు కల్పించండి అని అడుగుతాం’ అని వ్యాఖ్యానించారు. అయితే ఏ దేశం మీద కూడా సాయుధ దాడులు జరుపడం తమ విధానం కాదని చెప్పారు. భారత రాయబారి దీపక్ మిత్తల్, తాలిబన్ ప్రతినిధి మహ్మద్ అబ్బాస్ స్తానిక్జాయ్తో సమావేశం జరిగిన నాలుగు రోజుల్లోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతే కాకుండా భారత రాయబార కార్యాలయంపై ఉగ్రదాడికి పాల్పడ్డ హక్కానీ నెట్వర్క్ను సమర్థించారు.