హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో పౌరుడే కేంద్రంగా పురపాలక శాఖలో నవీనమైన ఆలోచనలు తీసుకొస్తూ కొత్త పురపాలక చట్టాన్ని ఇదే సభలో ఆమోదించుకున్నాం. గుణాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై సభ్యులు మాట్లాడిన అనంతరం పురపాలక శాఖ పద్దులపై మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. పురపాలనలో, ప్రజా సేవలో అందరూ కలిసే వచ్చేలా ముందుకు వెళ్తున్నాం. పట్టణీకరణ అత్యంత వేగంగా జరుగుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ కూడా ఒకటిగా ఉందన్నారు. భవిష్యత్లో పట్టణ జనాభా 50 శాతానికి చేరే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు, వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
పురపాలికల అభివృద్ధికి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నామని చెప్పారు. ప్రజా ఉపయోగమైకరమైన కార్యక్రమాలు చేపట్టామని స్పష్టం చేశారు. రాబోయే ఆరు నెలల కాలంలో పురపాలికల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. వీటికి రూ. 500 కోట్లు బడ్జెట్లో పెట్టుకున్నాం. ప్రతి మున్సిపాలిటీలో ఆధునిక వైకుంఠధామాలు ఏర్పాటు చేసి తీరుతామన్నారు. ఇందుకు రూ. 200 కోట్లు బడ్జెట్లో కేటాయించామన్నారు.
పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టామని తెలిపారు. గతంలో ఉన్న వాహనాలకు అదనంగా 4 వేల వాహనాలను సమకూర్చి చెత్తను తరలిస్తున్నామని తెలిపారు. డంపింగ్ యార్డు లేని మున్సిపాలిటీ అంటూ లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మానవ వ్యర్థాల శుద్దీకరణ ప్లాంట్లను అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేస్తున్నాం. 11 మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఈ ప్లాంట్లు పూర్తయ్యాయి. మిగతా మున్సిపాలిటీల్లో పనులు కొనసాగుతున్నాయి. పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం కొనసాగుతోందన్నారు. ఇప్పటికే 14 వేల మరుగుదొడ్లను పూర్తి చేశామన్నారు. తాగునీటి కోసం కష్టాలు లేకుండా చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వమే మిషన్ భగీరథపై ప్రశంసలు కురిపించింది అని మంత్రి కేటీఆర్ తెలిపారు.