చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లోనే సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. మనీశ్ పాండే(61 నాటౌట్: 44 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు), జానీ బెయిర్స్టో(55: 40 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకాలతో విజృంభించినా ఓటమి తప్పలేదు. 188 పరుగుల లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులే చేయడంతో కోల్కతా 10 పరుగుల తేడాతో గెలుపొందింది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన కోల్కతా సీజన్లో శుభారంభం చేసింది.
భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్రైజర్స్ 10 పరుగులకే ఓపెనర్లు డేవిడ్ వార్నర్(3), వృద్ధిమాన్ సాహా(7) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత పాండే, బెయిర్స్టో జోడీ రెండో వికెట్కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆరంభం నుంచి కోల్కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రసిధ్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. యువ ఆటగాళ్లు నితీశ్ రాణా(80:56 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి(53: 29 బంతుల్లో 5ఫోర్లు,2సిక్సర్లు) అద్భుత అర్ధశతకాలతో రాణించడంతో కోల్కతా భారీ స్కోరు సాధించింది. రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్(2/24), మహ్మద్ నబీ(2/32) మాత్రమే కోల్కతాను కట్టడి చేశారు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్(1/45), సందీప్ శర్మ(0/35) ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.