పుణె : ఏజెంట్ చేతిలో మోసపోయి భారత్ చేరుకున్న ఓ బంగ్లాదేశ్ జంటకు (Bangladesh Couple) పోలీస్ స్టేషనే ఇల్లుగా మారింది. గత రెండు నెలలుగా పోలీస్ స్టేషన్లోనే కాపురం పెట్టారు. వీరికి మూడు పూటలా భోజనం, రెండు సార్లు అల్పాహారం పోలీసులే అందిస్తున్నారు. సమయానికి అక్కడే నమాజ్ చేసుకుంటున్నారు. అయితే, తమ దేశ ఎంబసీ అధికారులు పట్టించుకోకపోవడంతో.. బంగ్లాదేశ్ వెళ్లేందుకు వీరికి అనుమతి పత్రాలు దొరుకడం లేదు. దాంతో ఏం చేసేది లేక వారు పీఎస్లో మకాం పెట్టారు.
బంగ్లాదేశ్లోని ఖుల్నా జిల్లాకు చెందిన మహమ్మద్ మండల్, ఆయన భార్య మాజిదా మండల్ ఉపాధి నిమిత్తం భారత్కు వచ్చేందుకు ఓ ఏజెంట్ సహకరించాడు. వీరు సరాసరి పుణెకు వచ్చి బుధవార్పేటలో నివాసముంటున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయామని గ్రహించిన వీరు చేసేదేం లేక.. అక్కడే చిన్నా చితకా పనికి కుదిరి కడుపు నింపుకుంటున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు అదుపులోకి తీసుకుని విచారించి.. కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వీరికి రెండేండ్ల జైలు శిక్ష విధించింది. వీరి జైలు శిక్ష జూన్ 14 తో ముగిసింది. వీరిని బంగ్లాదేశ్ పంపేందుకు ఏర్పాట్లు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దాంతో పుణెలోని ఫరాస్ఖానా ఇన్స్పెక్టర్ రాజేంద్ర లండ్గే.. బంగ్లాదేశ్ ఎంబసీని సంప్రదించి వారిని తరలించేందుకు సహకరించాలని కోరారు. అయితే, బంగ్లా రాయబారి కార్యాలయం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో ఈ జంటకు సదరు పోలీసులు పోలీస్ స్టేషన్లో నివసించేందుకు ఏర్పాట్లు చేశారు.
వీరు జూన్ నెల 14 వ తేదీ నుంచి పోలీస్ స్టేషన్లోనే మకాం పెట్టారు. వీరికి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు పూటలా భోజనం, రెండు సార్లు టిఫిన్ అందిస్తున్నారు. రోజుకు రెండు సార్లు ఇక్కడే నమాజ్ చేసుకుంటున్నారు. స్నానం చేయడం, దుస్తులు ఉతుక్కోవడం కూడా పీఎస్ వెనుకవైపు చేస్తున్నారు. ఇటీవల బక్రీద్ పండగకు వీరికి కొత్త బట్టలు కూడా ఇప్పించారు. బంగ్లాదేశ్లో ఉన్న తమ ఇద్దరు చిన్నారుల కోసం ఎంతగానో తపిస్తున్న ఈ జంటను వారి దేశానికి పంపేలా ఇప్పటికైనా భారత్, బంగ్లా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
భారత్కు తీసుకొచ్చేందుకు సహకరించిన ఏజెంట్.. తొలుత రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత మొత్తం తమ వద్ద లేవని ప్రాధేయపడినా వినని సదరు ఏజెంట్ వీరి విషయాన్ని పోలీసులకు చేరవేసినట్లు బాధితులు చెప్తున్నారు. తన భార్యను రెడ్లైట్ ఏరియాలో అమ్మేందుకు ప్రయత్నించాడని తెలుసుకుని ఏజెంట్ను నిలదీయగా పారిపోయాడని మహమ్మద్ మండల్ చెప్తున్నారు. బంగ్లాదేశ్ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఈ జంటను బంగ్లాకు పంపేందుకు సహకరించాలని ఇన్స్పెక్టర్ రాజేంద్ర లండ్గే కోరుతున్నారు.
నీరజ్ చోప్రా ‘పసిడి’ రహస్యమిదే..?!
శ్రీనగర్లో రాహుల్గాంధీ పర్యటన
అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
డయాబెటిస్ చికిత్సలో ‘స్మార్ట్’ ఇన్సులిన్
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
రెండో సెషన్ ఐపీఎల్ కోసం కొత్త నిబంధన.. అదేంటంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..