నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు వైద్యనిపుణులు. ఇప్పటికే వేడుకలు, ఊరేగింపులు, సామూహిక కార్యక్రమాలపై కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్రప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆరోగ్యంగా ఉంటే జీవితం రంగులమయంగా ఉంటుందని, రంగుల కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. హోలీ సందర్భంగా సమూహంగా ఉండటం, ఒకరిపై ఒకరు రంగులు వేసుకునే క్రమంలో భౌతిక దూరం పాటించకపోవడం వంటి పరిణామాలు ఎదురవుతాయని , ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఉస్మానియా, గాంధీ దవాఖానల సూరింటెండెంట్లు డాక్టర్ నాగేందర్, డాక్టర్ రాజారావులు విజ్ఞప్తి చేశారు. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని లేకపోతే సెకండ్వేవ్ విజృంభన సమయంలో పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
కరోనా దృష్ట్యా గత సంవత్సరం కూడా హోలీ వేడుకలకు ప్రజలు దూరంగా ఉన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ప్రజలు పాటించిన నియమాలతోనే తెలంగాణలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగామని మరికొన్ని రోజులు కూడా ప్రజలు నియమాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.