షాబాద్, జూన్ 3 : బ్లాక్ ఫంగస్కు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న బాలుడికి చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి చేయూతనందించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన రిషికేశ్వర్రావు కుమారుడు అత్విక్ (3)కు కొవిడ్ పాజిటివ్ వచ్చి తగ్గగానే పోస్ట్ కొవిడ్లో భాగంగా క్యాన్సర్, బ్లాక్ ఫంగస్లు రావడంతో ఆ చిన్నారిని నగరంలోని కాంటినెంటల్ దవాఖానలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. రిషికేశ్వర్రావు వారి ఆస్తులను అమ్ముకుని అత్విక్కు వైద్యం చేయిస్తున్నారు. అత్విక్ది పేద కుటుంబం కావడంతో ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీ సీఎం క్యాంపు ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లి అత్విక్ వైద్యం కోసం రూ. 10లక్షల ఎల్వోసీని మంజూరు చేయించారు. గురువారం అత్విక్ తండ్రి రిషికేశ్వర్రావును ఎంపీ తన నివాసానికి పిలిపించుకుని ఎల్వోసీని అందజేశారు. చిన్నారి చికిత్స పొందుతున్న దవాఖాన యాజమాన్యంతో మాట్లాడి అత్విక్కు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక నాయకులకు ఎంపీ సూచించారు.