ఎగువ మానేరులో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
23 అడుగులకు చేరిన కాళేశ్వర జలాలు
ఆయకట్టు రైతుల్లో ఆనందం
సిరిసిల్ల/గంభీరావుపేట, ఏప్రిల్ 1 : ‘నీరు పల్ల మెరుగు’ అనే నానుడిని తిరగరాస్తూ ‘నీరు ఎగువకు ప్రవహించును’ అనేలా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో చేసి చూపించారు. ఉమ్మడి పాలనలో మధ్య తరహా ప్రాజెక్ట్ అయిన ఎగువమానేరు జలాశయం వేసవిలో నీళ్లు లేక మైదానాన్ని తలపించేంది. ఇప్పుడు కాళేశ్వరం నిర్మాణంతో ఏప్రిల్ నెలలోనూ జలాశయానికి వరద వచ్చి చేరుతున్నది. ఎండకాలంలో ఎగువ మానేరు జలప్రవాహమనేది చరిత్ర తిరగరాసిన సత్యం. ఈ వర్ష కాలం సీజన్లో ఎగువమానేరు మత్తడి పొంగి పొర్లింది. ప్రాజెక్టులో నీరు పూర్తి స్థాయిలో ఉండటంతో పంటల సాగు కోసం ఆయకట్టుకు గతేడాది నవంబర్లో నీటిని విడుదల చేశారు. దీంతో 31 అడుగుల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో కాళేశ్వరం జలాలు రాక (మార్చి 30కి) ముందు 20 అడుగులు ఉండేది. గత మూడు రోజులుగా కూడవెల్లి వాగు ద్వారా చెక్డ్యాంలు దాటుకుని వస్తుండడంతో జలాశయం నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మార్చి 30న సాయంత్రం వరకు 1353 క్యూసెక్కులు, 31న 1007.053 క్యూసెక్కులు, గురువారం 857.633 క్యూసెక్కుల ప్రవాహంతో నీరు ప్రాజెక్ట్లోకి వచ్చి చేరుతున్నది. ఎండ కాలంలో జలాశయంలో నీళ్లు పెరుగుతుండడం చూసి స్థానిక రైతులు అద్భుత ఘటనగా భావిస్తున్నారు.