సిడ్నీ: ఇండియాలో చోరీకి గురై అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన కళాఖండాలను ఇండియాకు తిరిగి అప్పగించనుంది ఆస్ట్రేలియా. మొత్తం 14 కళాఖండాలను అప్పగించనుండగా ఇందులో ఆరు ఇండియాలో చోరీకి గురవడం లేదా ఆస్ట్రేలియాలోకి అక్రమంగా వచ్చినట్లు అక్కడి నేషనల్ గ్యాలరీ గురువారం వెల్లడించింది. క్యాన్బెరా గ్యాలరీ ఇప్పటికే వీటిని గుర్తించింది. వీటిలో శిల్పాలు, ఫొటోలు, పెయింటింగ్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ మత, సాంస్కృతిక పరమైన కళాఖండాలని, వీటి విలువ 22 లక్షల డాలర్లుగా ఉందని అక్కడి గ్యాలరీ చెప్పింది. వీటిలో కొన్ని 12వ శతాబ్దానికి చెందినవి కూడా ఉండటం విశేషం.
వీటన్నింటినీ కొన్ని నెలల్లోనే భారత ప్రభుత్వానికి తిరిగి అప్పగించనున్నట్లు గ్యాలరీ డైరెక్టర్ నిక్ మిట్జెవిచ్ చెప్పారు. తమ చరిత్రలోని ఓ క్లిష్టమైన అధ్యాయానికి ఇలా ముగింపు పలకబోతున్నట్లు ఆయన తెలిపారు. వాటిని ఇండియాకు తిరిగి ఇవ్వడం తమకు ఎంతో ఊరట కలిగించేదని అన్నారు. ఈ మొత్తం 14 కళాఖండాల్లో 13 అక్రమ రవాణాదారు సుభాష్ కపూర్కు చెందినవే. అతని ద్వారా అందుకున్న పలు కళాకృతులను ఇప్పటికే నేషనల్ గ్యాలరీ తిరిగి ఇండియాకు అప్పగించింది. వీటిలో తమిళనాడులోని ఆలయం నుంచి చోరీ చేసిన శివుని విగ్రహం కూడా ఉంది.