యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా విస్తరిస్తోంది. సకల సౌకర్యాలు.. సదుపాయాలతో నలు దిక్కులకూ వ్యాపిస్తోంది. రాష్ట్ర రాజధానితోపాటు ప్రధాన నగరాల్లో నిర్మాణ రంగాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేస్తున్నప్పటికీ జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం సుస్థిరంగా పరుగులు తీస్తోంది. చేరువనే ఉన్న హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున వస్తున్న వలసల నేపథ్యంలో పెరిగిన జనాభా కారణంగా రాజధాని కిటకిటలాడుతోంది. ఈ క్రమంలో సౌకర్యాలు, సదుపాయాల పరంగానూ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే స్థాయి సౌకర్యాలతో అదే ధరకే భూములు, ప్లాట్లు, ఇండ్లు లభిస్తుండడంతో జిల్లాలో రియల్ ఎస్టేట్రంగం కళకళలాడుతోంది. జిల్లాగా ఏర్పడిన నాటి నుంచే ఈ ప్రాంతంలో రియల్ భూం కొనసాగుతుండగా.. యాదాద్రి ఆలయాన్ని మరో వాటికన్ సిటీగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో రియల్ రంగం మరింత జోరందుకున్నది.
యాదాద్రి ఆలయం అభివృద్ధి జరగడం ఒక ఎత్తయితే.. రాజధానికి దగ్గరగా ఉండడం వల్ల కూడా పెట్టుబడి పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు.. ఉప్పల్ నుంచి యాదాద్రికి హైస్పీడ్ మెట్రో రైలు ఏర్పాటు.. ఘట్కేసర్- రాయగిరి మధ్యన ఎంఎంటీఎస్ రైలును నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తుండడం.. ఐటీ పరిశ్రమలు తరలివస్తుండడం వంటి పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న కస్టమర్లు, ఇన్వెస్టర్లు యాదాద్రి పరిసర ప్రాంతాల్లో ప్లాట్లు కొంటున్నారు. ఫలితంగా మొన్నటి వరకు రూ.లక్షల్లో ఉన్న భూముల రేట్లు నేడు రూ.కోట్లకు పడగెత్తాయి. ఇదే క్రమంలో ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ సైతం గణనీయంగా పెరుగుతూ వస్తోంది.
భూ కొనుగోళ్లపై కనిపించని కరోనా ప్రభావం
మూడేండ్ల క్రితం పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్, ఇండ్లు కొనేవారికి రాయితీలు ఇవ్వడం లాంటి చర్యలతో రియల్ రంగం కొద్దిగా పుంజుకోగలిగింది. ఆ తర్వాత కొవిడ్-19 సంక్షో భం అన్ని వర్గాల ఆర్థిక పరిస్థితిని తలకిందులను చేసింది. ఈ ప్రభావం రియల్ రంగంపై పడ్డప్పటికీ జిల్లాలో జరుగుతున్న దినదినాభివృద్ధి.. ఈ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్ వంటి పరిస్థితులు కొనుగోలుదారులను రియల్ రంగం నుంచి దూరం చేయలేకపోయాయి. కష్టకాలంలోనూ ప్లాట్ల క్యాన్సిలేషన్ పెద్దగా జరగడం లేదు. ఉద్యోగాలు కోల్పోయిన వారు సైతం కరోనా ఉధృతికి ముందు కొన్న ప్లాట్లను ఎవరూ రద్దు చేసుకోవడం లేదు. మళ్లీ పూర్వ స్థితికి రియల్ రంగం చేరుకుంటుందన్న నమ్మకంతోనే ప్లాట్లను ఎవరూ రద్దు చేసుకోవడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయాల్లో పెద్ద సంఖ్య లో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనమని వారు ఉదహరిస్తున్నారు.
ప్రాంతీయ వలయ రహదారితో పెరిగిన రియల్ బూమ్
జిల్లా ఆవిర్భవించిన నాటి నుంచే ఈ ప్రాంతంలో నెలకొన్న రియల్ ర్యాలీ నేటికీ కొనసాగుతోంది. కరోనా పరిస్థితుల్లో కొద్దిపాటిగా నెలకొన్న స్తబ్దత క్రమక్రమంగా వీడుతోంది. అయితే ప్రాంతీయ వలయ రహదారి ప్రకటన తర్వాత రియల్ రంగం మరింతగా పరుగులు పెడుతోంది. హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారుల వెంట ఉన్న భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాలు పారిశ్రామికంగా గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నాయి. ఇప్పటికే దండుమల్కాపురం పారిశ్రామిక కారిడార్గా రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్కు చెంతనే ఉన్న జిల్లా చుట్టూవందల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. మెరుగుపడ్డ రవాణా వ్యవస్థతో ఔత్సాహికులు సైతం ఈ ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్తోపాటు జిల్లాలోని హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారులు అనుసంధానమయ్యేలా 338కి.మీ.ల మేర రీజినల్ రింగ్రోడ్డును నిర్మించనున్నారు.
త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతోపాటుతెలంగాణప్రభుత్వం బడ్జెట్లో రూ.725కోట్లు కేటాయించింది. ఇది పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతం ఇస్తోంది. రీజినల్ రింగ్ రోడ్డు అం దుబాటులోకి వస్తే రవాణా సౌకర్యం మరింత పెరిగి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఈ ప్రాంతానికి తరలిరానున్నా యి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతోపాటు, వ్యవసాయేతర పరిశ్రమలు నెలకొల్పేందుకు మెండు గా అవకాశాలు కలగనున్నాయి. ప్రస్తు తం నెలకొన్న పరిస్థితుల్లో హైదరాబాద్కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న భూముల ధరలకు సైతం రెక్కలొచ్చాయి. రవాణా సౌక ర్యం ఉండి సుదూర ప్రాతంలో ఉన్న భూములను సైతం కొనేందుకు రియల్లర్లు ఎగబడుతున్నారు.
పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు
జిల్లాలో ధరణి ద్వారా తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇటీవల జోరందుకుంది. నవంబర్ 2 నుంచి ఇప్పటివరకు 17 మండలాల పరిధిలో 16,821 రిజిస్ట్రేషన్లు జరిగాయి. తుర్కపల్లి తహసీల్దార్ కార్యాలయ పరిధిలో 1,503 రిజిస్ట్రేషన్లు, యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయ పరిధిలో1,402 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రారంభంలో 10 రిజిస్ట్రేషన్లకే అవకాశం ఉండేది. తర్వాత రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం 30 వరకు రిజిస్ట్రేషన్లు చేసే వెసులుబాటును ప్రభు త్వం కల్పించింది. ప్రతి నిత్యం 30 స్లా ట్లు బుక్ అవుతుండడంతో తహసీల్దార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.
ఇవీ కూడా చదవండీ…
అమెజాన్ ప్రైమ్లో జాతిరత్నాలు .. ఎప్పుడంటే..?
తిరుపతి ఉప ఎన్నిక : 14న ఏపీ సీఎం బహిరంగ సభ!
ఎమర్జింగ్ టెక్నాలజీతో వైద్య సేవల విస్తరణకు అవకాశం : మంత్రి కేటీఆర్
మిసెస్ శ్రీలంక పోటీలో వివాదం.. రన్నరప్కు విన్నర్ టైటిల్