మెల్బోర్న్: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ వెనక్కి తగ్గారు. ఇండియా నుంచి వస్తే జైల్లో వేస్తామన్న కఠిన నిబంధనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇండియాలో ఉన్న ఆస్ట్రేలియన్లతోపాటు అక్కడి మానవ హక్కుల సంఘాలు, ప్రధాని సన్నిహితులు కూడా ఈ నిబంధనపై విమర్శలు గుప్పించారు. నీకెంత ధైర్యం.. నీ చేతులకు రక్తం అంటుకుంది అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ప్రధాని మోరిసన్ మెత్తబడ్డారు.
మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన ఆస్ట్రేలియన్లను జైల్లో వేసే అవకాశాలు అసలు లేవు అని అన్నారు. ప్రస్తుతం ఇండియాలో 9 వేల మంది వరకూ ఆస్ట్రేలియన్లు ఉన్నారు. అందులో ఐపీఎల్లో ఆడుతున్న ప్రముఖ క్రికెటర్లు, కామెంటేటర్లు కూడా ఉండటం గమనార్హం. తమ పట్ల ప్రధాని కఠినంగా వ్యవహరించడంపై మాజీ క్రికెటర్ ట్విటర్ వేదికగా తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోరిసన్ స్పందించారు.
నా చేతులకు రక్తం అంటుకుందన్న వ్యాఖ్యలు అర్థం లేనివి. ఆస్ట్రేలియాలో కరోనా మూడో వేవ్ను అడ్డుకోవడానికే నేను ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. అయినా వాళ్లను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని మోరిసన్ వెల్లడించారు. మే 15 తర్వాత ఇండియాలో ఇరుక్కుపోయిన ఆస్ట్రేలియన్లను స్వదేశానికి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు.