సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతుండటం, అదే సమయంలో సిడ్నీలో కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆసీస్ ప్రధాని ఇలా క్షమించమని అడగడం గమనార్హం. ప్రపంచంలోని ధనిక దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియాలో వ్యాక్సినేషన్ చాలా నెమ్మదిగా సాగుతోంది. కేవలం 11 శాతం మందికే వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో ఊహించినంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగడం లేనందుకు క్షమించండి. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై పూర్తి బాధ్యత నాదే. మన ముందున్న సవాళ్లకు కూడా నాదే బాధ్యత. కొన్ని మన చేతుల్లో ఉంటాయి. కొన్ని ఉండవు అని స్కాట్ మోరిసన్ అన్నారు.
నెల రోజులుగా సిడ్నీ లాక్డౌన్లోనే ఉన్నా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా న్యూసౌత్ వేల్స్లో 124 కేసులు నమోదయ్యాయి. ఇది దేశమంతా వేగంగా విస్తరిస్తోంది. నిజానికి కరోనా విషయంలో అక్కడి ప్రభుత్వ నిర్ణయాలపై మొదటి నుంచీ ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారు. ఆస్ట్రేలియా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్పైనే ఎక్కువగా ఆధారపడింది. అయితే దీని కారణంగా రక్తం గడ్డ కడుతుండటంతో ప్రస్తుతం కేవలం 60 ఏళ్లు నిండిన వాళ్లే దీనిని వేస్తున్నారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్నే ఎక్కువగా నమ్ముకోవడంపై అక్కడి ఆరోగ్య అధికారులు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.