న్యూఢిల్లీ: మయన్మార్ నాయకురాలు ఆంగ్సాన్ సూకీ నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇవాళ తొలిసారి ప్రజల మధ్య కనిపించారు. ఆమె ప్రభుత్వంపై గత ఫిబ్రవరిలో మిలిటరీ తిరుగుబాటు చేసి సూకీని నిర్బంధించింది. అప్పటి నుంచి సూకీ మిలిటరీ నిర్బంధంలో ఉన్నారు. కాగా సోమవారం కోర్టు ముందు హాజరైన సమయంలో ఆమె తన వ్యక్తిగత లాయర్లను కలిసి వారితో 30 నిమిషాల పాటు చర్చించడానికి అవకాశం కల్పించారు.
ఈ విషయమై ఆమె న్యాయ నిపుణుల బృందం అధినేత ఖిన్ మాంగ్ ఝా మీడియాతో మాట్లాడుతూ.. సూకీ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. నిర్బంధంలో ఆమెకు వార్తాపత్రికలు చదివే అవకాశం లేదని, బయట ఏం జరుగుతుందనే విషయంలో ఆమె కొద్ది సమాచారం మాత్రమే ఉందని ఝా తెలిపారు. గత నవంబర్ ఎన్నికల్లో ప్రభుత్వం భారీగా అవకతవకలకు పాల్పడిందనే సాకుతో అక్కడి సైన్యం ప్రభుత్వాన్ని చేజిక్కించుకుంది.
అనంతరం సూకీ సహా సుమారు నాలుగు వేల మందిని అరెస్ట్ చేశారు. అంతే కాకుండా సూకీపై దేశ బహిష్కరణ కూడా విధించారు. అక్రమ రీతిలో వాకీ టాకీలను కలిగి ఉన్నట్లు సూకీపై ఆరోపణలు ఉన్నాయి. కానీ, సైనిక చర్యను వ్యతిరేకిస్తూ మయన్మార్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 800 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు.