క్విటో (ఈక్వెడార్), సెప్టెంబర్ 30: ఈక్వెడార్లోని గుయాక్విల్ జైలులో జరిగిన ఘర్షణలో దాదాపు 116 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు. బుధవారం జైలులోని రెండు గ్యాంగుల మధ్య పెరిగిన మాటల యుద్ధం చివరికి చంపుకునే వరకూ వెళ్లింది. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడం, కత్తులతో దాడి చేసుకోవడం, పేలుడు పదార్థాలను విసురుకోవడంతో దాదాపు 116 మంది ప్రాణాలుకోల్పోయారు. కొన్ని మృతదేహాలు తలలు లేకుండా ఉన్నాయి. పైపులైన్లలో ఇరికించిన మృతదేహాలు కనిపించాయి. ఈక్వెడార్ దేశ చరిత్రలో జైలులో ఇలాంటి ఘటన ఇప్పటి వరకూ జరుగలేదని పలువురు చెప్పారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉండటంతో ఆ దేశ అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో జైళ్లలో అత్యవసర పరిస్థితిని విధించారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులైన ఖైదీలే ఈ ఘర్షణకు పాల్పడినట్టు అధికారులు చెప్పారు. ముఖ్యంగా జైలులో ఆధిపత్యపోరు కోసం ఒకరినొకరు చంపుకున్నారని తెలిపారు.