ప్రతిరోజు ఒకే దారిలో పయనం సాగించడం నిరాసక్తతకు దారితీస్తుంది. నూతన మార్గాల్ని ఎంచుకుంటే ప్రయాణంలో సరికొత్త అందాల్ని ఆస్వాదించవొచ్చు. ప్రస్తుతం మన కథానాయికలు ఇదే పంథాను ఫాలో అవుతున్నారు. పాత్రలపరంగా మూసను బ్రేక్ చేస్తూ వినూత్న రూపాల్లో తమను తాము ఆవిష్కరించుకునేందుకు సిద్ధమవుతున్నారు. సరికొత్త జోనర్స్లో సినిమాల్నిం ఎంచుకుంటూ వైవిధ్యమైన పాత్రల్లో రాణించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.
శాకుంతలంతో పౌరాణిక బాటలో
కెరీర్ ముగిసేలోపు పౌరాణిక, జానపద సినిమా ఒక్కటైనా చేయాలని ప్రతి నాయకానాయికలు కలలు కంటుంటారు. అయితే అవకాశం మాత్రం కొందరినే వరిస్తుంటుంది. ‘శాకుంతలం’ సినిమా ద్వారా సమంత ఆ అదృష్ట నాయికా జాబితాలో చేరింది. పదకొండేళ్ల సుదీర్ఘ కెరీర్లో ఆమె నటిస్తున్న తొలి పౌరాణిక చిత్రమిదే కావడం గమనార్హం. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయగాథ ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో కావ్యనాయకి శకుంతలగా సమంత కనిపించబోతున్నది. పీరియాడికల్ సినిమాలో యువరాణి పాత్రను చేయాలనే తన చిన్ననాటి కల ఈ సినిమా ద్వారా తీరబోతున్నదని సమంత సంతోషం వ్యక్తం చేసింది.
హారర్లో మొదటి అడుగు
రాశీఖన్నా పేరు వినగానే చక్కటి అందచందాలు, అభినయం కలబోసిన కుటుంబ, ప్రేమకథా చిత్రాలే గుర్తుకొస్తాయి. ఈ భామ తొలిసారి తన రొటీన్ పంథాకు భిన్నంగా తమిళ చిత్రం ‘అరాణ్మనై-3’తో హారర్ జోనర్లోకి అడుగుపెడుతోంది. హారర్ సినిమాలంటే తనకు భయమని, ఆ కథల్ని ఎంపిక చేసుకోవడం అంతగా ఇష్టం ఉండదని అనేక సందర్భాల్లో చెప్పిన ఈ పంజాబీ సోయగం కథలో కొత్తదనం నచ్చడంతో ‘అరాణ్మనై-3’ చిత్రానికి పచ్చజెండా ఊపింది. సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అర్య హీరోగా నటిస్తున్నారు. ఇక అగ్రనాయికల్లో ఒకరైన కీర్తిసురేష్ ఇప్పటివరకు హారర్ సినిమా చేయలేదు. తొలిసారి ఆమె భయపెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ పేరుతో ఓ హారర్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రధాననాయిక పాత్ర కోసం కీర్తిసురేష్ పేరును పరిశీలిస్తోన్నట్లు తెలిసింది.
ఫస్ట్ టైమ్ స్పోర్ట్స్ ఫిల్మ్
క్రీడా నేపథ్య చిత్రాల పట్ల యువతలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాల్లో భాగం అవ్వడానికి అగ్రతారలు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. సినీ జర్నీలో మొదటి సారి తమన్నా క్రీడానేపథ్య కథాంశంతో ‘సీటీమార్’ సినిమా చేస్తోంది. ఇందులో ఆమె తెలంగాణ మహిళా కబడ్డీటీమ్ కోచ్ పాత్రను పోషిస్తుంది. ఈ సినిమా కోసం తెలంగాణ భాషపై పట్టుపెంచుకొని సొంతంగా డబ్బింగ్ చెప్పింది.
తొలిసారి యాక్షన్కు సిద్ధం
ఇదివరకు యాక్షన్ ప్రధాన సినిమాల్లో కథానాయికలు కనిపించడం కొంత అరుదుగానే జరిగేది. కానీ ప్రస్తుతం వారి ఆలోచన ధోరణి మారింది. రొటీన్ పాత్రలకు పరిమితమవ్వకుండా కథలు నచ్చితే యాక్షన్ సినిమాలు చేయడానికి సిద్ధమంటున్నారు. ఈ కోవలో నివేధాథామస్ తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తోంది. కొరియన్ చిత్రం ‘మిడ్నైట్న్న్రర్స్’ ఆధారంగా సుధీర్వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమాలో ట్రైనీ పోలీస్ ఆఫీసర్స్గా రెజీనా, నివేధా థామస్ నటిస్తున్నారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమాలో కాజల్ అగర్వాల్ ‘రా’ ఏజెంట్గా కనిపిస్తోంది. కెరీర్లో యాక్షన్ ప్రధాన పాత్రలో కాజల్ నటిస్తుండటం ఇదే మొదటిసారి. ‘5డబ్ల్యూఎస్’ సినిమా కోసం ఫస్ట్టైమ్ పాయల్రాజ్పుత్ పోలీస్ అవతారం ఎత్తింది. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. సినీజర్నీలో మొట్టమొదటిసారి పూర్తిస్థాయి బయోపిక్ చిత్రంలో రకుల్ప్రీత్సింగ్ నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒలిపింక్స్ క్రీడల్లో దేశానికి పతాకాన్ని అందించిన తెలుగు క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి బయోపిక్లో ఆమె నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.