అంబర్పేట, మే 22 : అంబర్పేట నియోజకవర్గంలోని పలు బస్తీలు, కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ జీహెచ్ఎంసీ అధికారులకు చెప్పారు. ఎక్కడైతే పనులు చేయడానికి సిద్ధమవుతారో అక్కడ మాత్రమే రోడ్లు తవ్వాలని, పనులు ఆలస్యం చేస్తే రోడ్లు తవ్వడం మానేయాలన్నారు. శనివారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రారంభించబోయే పనులు, పెండింగ్ పనుల విషయమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీలు, కాలనీల్లో పూర్తిస్థాయిలో రోడ్ల పనులు ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందు మాత్రమే రోడ్లను తవ్వాలని, ఎక్కువ రోజుల ముందు తవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
లాక్డౌన్ సమయంలో ఎక్కడైతే రోడ్ల నిర్మాణం, పుట్పాత్ల పనులు చేపడతారో అవి పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో చేపట్టనున్న నూతన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు. శివం రోడ్డులో జరుగుతున్న నాలా ఎత్తు పెంచే పనుల్లో వేగం పెంచాలని తెలిపారు. ఈ పనులు ఎందుకు ఆలస్యంగా జరుగుతున్నాయని ప్రశ్నించారు. అయ్యప్ప టెంపుల్ వద్ద కూడా డ్రైనేజీ పైపులైన్ పనులు పూర్తైనా ఇంకా రోడ్డు నిర్మాణం ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట సర్కిల్ ఈఈ శంకర్, డీఈలు సుధాకర్, సంతోష్, ఏఈలు ప్రేరణ, శ్వేత, ఫరీద్, వర్క్ ఇన్స్పెక్టర్లు మనోహర్, రవి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.