న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టీకా ఉత్సవ్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు సూచనలు చేశారు. కరోనా కేసులు భారీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నాలుగు రోజుల పాటు సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు వేయడమే లక్ష్యంగా టీకా ఉత్సవ్ ప్రారంభించారు. టీకా పండుగ ప్రారంభం సందర్భంగా ఆదివారం ఉదయం మోదీ ట్వీట్ చేశారు.
కరోనా మహమ్మారి వ్యాప్తికి చెక్ పెట్టడానికి వ్యాక్సినేట్, ట్రీట్, సేవ్, చెక్ అనే నాలుగు సూత్రాలను ఆయన ప్రతిపాదించారు. 45 ఏళ్లకు పైబడిన వాళ్లందరికీ వ్యాక్సిన్తు వేస్తున్న విషయం తెలిసిందే. అర్హులందరూ కొవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వ్యాక్సిన్లు వేయించుకోవచ్చు.
ఆదివారం (ఏప్రిల్ 11)న జ్యోతిబా పూలే జయంతి. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి. దీంతో ఈ నాలుగు రోజులను టీకా ఉత్సవ్ నిర్వహించడానికి ప్రత్యేకంగా ఎంచుకున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా ఇవ్వడంతోపాటు వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని కూడా మోదీ పిలుపునిచ్చారు.
అటు పెద్ద రాష్ట్రాలు, జనాభా ఎక్కువ ఉన్న ఉత్తర ప్రదేశ్, బీహార్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ టీకా ఉత్సవ్ సందర్భంగా వేగవంతం చేయడమే లక్ష్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రజలను అభ్యర్థించారు. పెద్ద సంఖ్యలో వచ్చి వ్యాక్సిన్లు వేసుకోవాలని సూచించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పది కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు.