ఎర్బిల్: ఇరాక్ మరోసారి బాంబుల మోతతో దద్దలిర్లింది. ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్తో బాంబు దాడి జరిగింది. అయితే ఈ దాడిలో ఎవరికి ప్రమాదం జరగలేదని కుర్దిష్ భద్రతా దళాలు ప్రకటించాయి. అయితే ఇప్పటివరకు ఈ దాడికి పాల్పడింది తామేనని ఎవరూ ప్రకటించుకోలేదని తెలిపాయి. విమానాశ్రయం సమీపంలోనే అమెరికన్ కాన్సులేట్ ఉండటం గమనార్హం. పేలుళ్ల అనంతరం ఎయిర్పోర్టు దారులను మూసివేశారు.
శనివారం రాత్రి అర్బిల్ విమానాశ్రయం సమీపంలో రెండు సార్లు భారీ శబ్ధాలు వినిపించాయని, చుట్టు పక్కల ప్రాంతాలు మొత్తం నల్లని పొగలు కమ్ముకున్నాయని స్థానికులు వెల్లడించారు. కాగా, విమానాశ్రయం కేంద్రంగా జిహాద్ వ్యతిరేక దళాలు కూడా పనిచేస్తున్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో ఇరాక్లో విమానాశ్రయాలపై దాడులు సర్వసాధారణమయ్యాయి. అమెరికా దళాలు, అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతుంటాయి.