న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రెండో వేవ్ వచ్చే మే నెల 26వ తేదీ వరకు కొనసాగవచ్చునని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నిర్వహించిన సర్వేలో తేలింది. మలి విడుత వేవ్ ఫిబ్రవరిలో ప్రారంభదశకు చేరుకున్నదని, ఏప్రిల్ రెండో అర్థభాగంలో కొత్త కేసులు గరిష్ఠస్థాయికి పెరుగుతాయని వెల్లడించింది.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,476 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది నవంబర్ ఆరో తేదీ తర్వాత అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో మహమ్మారి ప్రభావంతో ప్రజలు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
తొలి విడుత కరోనా ప్రభావం కంటే మలి వేవ్ పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఎస్బీఐ ‘ది సెకండ్ వేవ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్- ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్?’ అనే పేరుతో రూపొందించిన నివేదికలో పేర్కొంది. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నందున పరిస్థితిని నియంత్రించవచ్చునని వ్యాఖ్యానించింది.
ఈ ఏడాది జనవరి 16 నుంచి ఈ నెల 24 వరకు దేశవ్యాప్తంగా 5.31 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. రాజస్థాన్, గుజరాత్, కేరళ, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాల్లో 20 శాతానికి పైగా సీనియర్ సిటిజన్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. పంజాబ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నది.