కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయం వద్దకు ఎవరూ వెళ్లొద్దని అమెరికన్లను ఆ దేశ ప్రభుత్వం హెచ్చరించింది. అక్కడ పరిస్థితి గందరగోళంగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో పర్యటనలు వాయిదా వేసుకోవాలని సూచించింది.
తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుతం అమెరికన్లు ఎంత మంది ఉంటారన్నది అమెరికా ప్రభుత్వానికి సమాచారం లేదు. తమ పౌరులపై తాలిబన్లు ప్రతీకారం తీర్చుకుంటారేమోనని ఆందోళనగా ఉందని వైట్ హౌస్ కమ్యూనికేషన్ల డైరెక్టర్ కేట్ బెడింగ్ ఫీల్డ్ చెప్పారు. ఆఫ్ఘన్లో ఉన్న తమ పౌరులను గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టామన్నారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి శరవేగంగా సైనిక బలగాలను ఉపసంహరించడంపై విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వివరణ ఇచ్చుకున్నారు. తమ పౌరుల్ని హింసిస్తే సహించేది లేదని తాలిబన్లను హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని కూడా చెప్పారు.