అందరినీ మురిపిస్తున్న విఠల్
తన కుంచెతో పల్లె ప్రతిబింబాలకు ప్రాణం
సీఎం కేసీఆర్, పీఎం మోదీకి చిత్రాలు అందజేత
కంగ్టి, మార్చి 29: అతనొక ఉపాధ్యాయుడు, సృజనాత్మకతను వెలికితీసి పల్లె అందాలను కళ్లకు కట్టినట్లు చిత్రాలను గీయడంలో దిట్ట కంగ్టి మండలం తడ్కల్కు చెందిన ఆణిముత్యం ముప్పిడి విఠల్. తండ్రి లక్ష్మయ్య, తల్లి నాగమ్మ నలుగురు సంతానంలో విఠల్ రెండోవాడు. విఠల్కు చిన్నతనం నుంచి ప్రకృతి రమనీయ దృశ్యాలు స్ఫూర్తినిచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశారు. అనేక ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన విఠల్ ప్రస్తుతం ఫ్రీలాన్సర్గా కొనసాగుతున్నారు. చిన్ననాటి నుంచి పట్టుదల, ఆత్మవిశ్వాసంతో తన కుంచె ద్వారా గీసిన ఎన్నో చిత్రాలు జనాదరణ పొందాయి. చిన్నప్పుడు విఠల్కు స్ఫూర్తినిచ్చింది తడ్కల్ గ్రామానికి చెందిన తన గురువు కిషన్ మహరాజ్. తనలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఆయనెంతో స్ఫూర్తినిచ్చారు. విఠల్ చదువుకునే పాఠశాల లో మరో ఉపాధ్యాయు డు మొగులప్ప కూడా పరోక్షంగా ప్రొత్సహించారు.
పల్లెప్రతిబింబాలకు ప్రాణం
చదువుకుంటున్న రోజుల్లో విఠల్ వేసిన వివేకానుందుని చిత్రాపటానికి కళాశాల యాజమాన్యం ఉత్తమ చిత్రకారుడిగా బహుమతి అందజేసింది. 1995లో తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన సౌత్జోన్ చిత్రలేఖనం పోటీలో రజత పతకాన్ని సాధించా రు. 1997లో జన్మభూమి చిత్రలేఖనం పోటీల్లో రాష్ట్రస్థాయిలో మూడో బహుమతి పొంది అప్పటి లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి నుంచి అవార్డు అందుకున్నా రు. 1998లో నిర్వహించిన అంతర్ విశ్వవిద్యాయంలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ అవార్డును గెలుపొంది ప్రముఖ స్వతంత్య్ర సమరయోధుడు దాశరథీ రంగాచార్యతో ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. 2000లో ముదిరాజ్ మహాసభల్లో కార్గిల్ యుద్ధ సన్నివేశాల చిత్రాలకు బంగారు పతకాన్ని సాధించారు.
సీఎం కేసీఆర్, పీఎం నరేంద్రమోడీలకు
వడ్లగింజలతో తయ్యారు చేసిన చిత్రాలు బహూకరణ
ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీలకు ప్రత్యేకంగా వడ్లగింజలతో తయారు చేసిన చిత్రాలను అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు కొన్ని సంవత్సరాల క్రితం ఈ చిత్రాన్ని బహుమానంగా అందజేశారు. చిత్రాన్ని చూసి న ముఖ్యమంత్రి ఎంతో అభినందించారని ఆయన సంతోషించారు. కేసీఆర్ ఇటీవల రైతుబంధు పథకంతో ఎకరానికి రూ.5వేలు రైతులకు అందజేస్తున్నందున ఈ చిత్రాన్ని వడ్లగింజలతో వేసినట్టు చెప్పారు.
జిల్లా ఉత్తమ, నేషనల్ అవార్డులు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా 2017 జూన్ 2న జిల్లా అధికారులు సంగారెడ్డిలో నిర్వహించిన అవార్డుల ప్రదానంలో కళారంగానికి ఉత్తమ అవార్డును విఠల్కు అందజేశారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, అప్పటి కలెక్టర్ మానిక్రాజ్ కణ్ణన్ చేతులమీదుగా రూ.51వేల నగదుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. సమైక్యపాలనలో ప్రభుత్వ ప్రోత్సాహం లేదని తెలంగాణ ఆవిర్భవించిన తరువాత కళాకారులకు ప్రోత్సాహకం అందుతుందన్నారు.