వాషింగ్టన్: భవిష్యత్ జనాభా అవసరాల నిమిత్తం పంటల దిగుబడిని పెంచేందుకు, కరువు కాటకాలను తట్టుకొని మేలురకమైన ధాన్యాన్ని ఉత్పత్తి చేయడానికి అమెరికా, చైనా పరిశోధకుల బృందం కొత్త సాగు విధానాన్ని తీసుకొచ్చింది. వరి, బంగాళదుంప, కూరగాయల మొక్కల్లో.. జంతువుల్లోని ఎఫ్టీవో జన్యుకణాలను ప్రవేశపెట్టారు. సాధారణంగా ఎఫ్టీవో జన్యు కణాలు మనుషుల్లో కొవ్వు, ఊబకాయానికి కారణమవుతాయి. అయితే వీటిని మొక్కల్లోని ఆర్ఎన్ఏలో ప్రవేశపెట్టినప్పుడు పంట దిగుబడి 50 శాతం పెరిగిందని పరిశోధకులు తెలిపారు. అలాగే, కిరణజన్యసంయోగక్రియ ఎక్కువగా జరుగడంతోపాటు మొక్కలవేళ్లు గతంతో పోలిస్తే భూమిలోపలికి మరింత లోతుగా చొచ్చుకుపోతున్నట్టు గుర్తించారు. దీంతో కరువు వంటి నీటి ఎద్దడి పరిస్థితుల్లోనూ పంట మనుగడ సాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.