న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: జర్మనీ మొట్టమొదటి మహిళా చాన్స్లర్, శక్తిమంతమైన నేత ఏంజెలా మెర్కెల్ శకం ముగిసింది. శనివారంతో ఆమె పదవీకాలం పూర్తైంది. మళ్లీ తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆమె గతంలోనే ప్రకటించారు. తన రాజకీయ వారసుడిగా ఆర్మిన్ లాషెట్ను ప్రకటించారు. శనివారం ఆమె ఆర్మిన్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెర్కెల్ 16 ఏండ్లుగా జర్మనీకి చాన్స్లర్గా ఉన్నారు. ఈ సుదీర్ఘకాలంలో ఆమె జర్మనీని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలిపారు. అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. ఈయూ-ప్రపంచం మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో ముఖ్య పాత్ర వహించారు. ఈయూలో జర్మనీని అత్యంత శక్తిమంతమైన దేశంగా నిలిపారు. 2007లో ఆర్థిక సంక్షోభం, గ్రీకు అప్పుల సంక్షోభం, 2016లో బెర్లిన్లో ఉగ్రవాద దాడులు, బ్రెగ్జిట్, కొవిడ్ ఇలా ఎన్నింటినో ఆమె సమర్థంగా ఎదుర్కొన్నారు. జర్మనీ పార్లమెంటుకు ఆదివారం ఎన్నికలు జరుగనున్నాయి.
1990లో తొలిసారి పార్లమెంటుకు
మెర్కెల్ వయసు 67 ఏండ్లు. 1954లో జూలై 17న ఆమె హాంబర్గ్లో జన్మించారు.1986లో క్వాంటమ్ కెమిస్ట్రీ నుంచి డాక్టరేట్ పొందారు. మూడేండ్ల పాటు శాస్త్రవేత్తగా సేవలందించారు. 1977లో వివాహం చేసుకొన్నారు. తర్వాత ఐదేండ్లకు విడాకులు తీసుకొన్నారు. 1989లో బెర్లిన్ గోడ కూల్చివేత తర్వాత ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1990లో ఆమె తొలిసారి జర్మన్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2005లో చాన్స్లర్ అయ్యారు. జర్మనీకి మొట్టమొదటి మహిళా చాన్స్లర్గా రికార్డు సృష్టించారు.
జర్మనీలో ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఒపీనియన్ పోల్స్లో మెర్కెల్ ప్రాతినిధ్యం వహిస్తున్న సీడీయూ/సీఎస్యూ కూటమి కన్నా ఎస్పీడీ పార్టీ ముందుంది. జర్మనీ పార్లమెంటు లో 598 సీట్లు ఉన్నాయి. వీరిలో 299 మంది జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరిని ప్రజలు నేరుగా ఎన్నుకొంటారు. మరో 299మందిని పార్టీకి వచ్చిన ఓట్లను బట్టి ఎంపిక చేస్తారు. ఇందుకోసం జర్మనీ పౌరులకు రెండు రకాల ఓట్లు ఉంటాయి. ఒకటి పార్టీకి వేయాలి. ఒకటి అభ్యర్థికి వేయాలి. కాగా, జర్మనీకి తదుపరి చాన్సలర్ ఎవరనేది వెంటనే తెలియదు. పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు తర్వాత ఎన్నుకొంటారు.