కొవిడ్ బాధితులకు శుభవార్త!
‘రెమ్డెసివర్’… ఇప్పుడు వార్తల్లో మార్మోగుతున్న ఔషధం. కొవిడ్ ప్రాణాంతకంగా మారే తరుణంలో ఇది మంచి ఫలితాలనిస్తుందని చాలామంది నమ్మకం. నిజానికి దీనిని ‘హెపటైటిస్-సి’ వ్యాధిని అరికట్టేందుకు కనుగొన్నారు. కొవిడ్ మీదకూడా ప్రభావం చూపడంతో దాన్ని ప్రస్తుత పరిస్థితులలో వినియోగిస్తున్నారు. హెపటైటిస్-సి, కొవిడ్ వైరస్ల మధ్య అనూహ్యమైన సారూప్యత ఉండటమే దీనికి కారణం. ఇదంతా గమనించిన అమెరికాలోని మౌంట్ సినాయ్ పరిశోధకులకు ఓ ఆలోచన వచ్చింది. ‘హెపటైటిస్-సి కోసం ఉపయోగించే ఇతర ఔషధాలను కూడా కొవిడ్ బాధితులమీద ప్రయోగించి చూస్తే ఎలా ఉంటుంది?’ అన్న కోణంలో వారు పరిశోధనలు ప్రారంభించారు. ఇందులో భాగంగా పది ఔషధాలను ప్రయోగించారు. ఆశ్చర్యంగా వాటిలో ఓ నాలుగు ఔషధాలు కొవిడ్మీద అద్భుతంగా పనిచేస్తున్నట్టు తేలింది. వీటిని కనుక ‘రెమ్డెసివర్’తో కలిపి ఇస్తే పది రెట్లు మెరుగైన ఫలితం ఉంటున్నట్టు తేలింది. కొవిడ్తో విలవిల్లాడుతున్న ప్రపంచానికి ఇదొక రకంగా శుభవార్తే! కాకపోతే, ఇంకొంత అధ్యనం జరగాల్సి ఉంది.
చెర్నోబిల్ ఘటనపై కొత్త పరిశోధనలు
చెర్నోబిల్ ప్రమాదం చాలామందికి ఓ పీడకల. సరిగ్గా 35 ఏండ్ల క్రితం అప్పటి యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్న ఉక్రెయిన్లో ఈ దుర్ఘటన జరిగింది. అక్కడి అణువిద్యుత్ కేంద్రం పేలిపోవడంతో అణుధార్మిక పదార్థాలు గాల్లోకి ఎగిశాయి. ఈ ప్రమాదం వల్ల నేరుగా చనిపోయింది కొద్దిమందే! కానీ, ఈ అణుధార్మికత కారణంగా అసంఖ్యాక ప్రజలు క్యాన్సర్ తదితర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఇప్పటికంకా ఈ సంఘటనపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి రెండు పరిశోధనలు మరిన్ని కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చాయి. చెర్నోబిల్ రేడియేషన్కు గురైనవారి శరీరంలో జన్యుమార్పులు వచ్చినా, అవి భావితరాలను ప్రభావితం చేయలేదని తేలింది. రేడియేషన్ ప్రభావం కొన్ని తరాలను వెన్నాడుతుందనే భయం తప్పని ఈ ప్రయోగం నిరూపించింది. అలాగే, ఆ సమయంలో గర్భస్థ శిశువులూ క్యాన్సర్ లాంటి సమస్యలను ఎదుర్కొన్నట్టు తేలింది. మొత్తానికి అణుధార్మికతకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు అవసరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ప్రీబయాటిక్స్కు సిద్ధం కండి!
‘ప్రొబయాటిక్స్’ అనే మాట మనకు కొత్తేమీ కాదు. పెరుగు, ఇడ్లీలాంటి పులియ బెట్టిన పదార్థాలలో వుండే ఈ ప్రొబయాటిక్స్ మన జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. యాంటీబయాటిక్స్వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి. కానీ, ప్రీబయాటిక్స్ అన్నమాట ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తున్నది. ఆహారపదార్థాల్లోని ప్రత్యేకమైన పీచుపదార్థమే ప్రీబయాటిక్. ఇదికూడా జీర్ణవ్యవస్థకు చాలా అవసరమని చాలా పరిశోధనలు నిరూపించాయి. తాజాగా ఇంగ్లండ్లోని సర్రే విశ్వవిద్యాలయ పరిశోధకులు రోజూ తగినంత ప్రీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుముఖం పట్టి, మానసిక ప్రశాంతత లభిస్తున్నట్ట్టు గుర్తించారు. 64 మందిని పరిశీలించి దీనిని తేల్చారు. ఆకుకూరలు, ఉల్లిపాయలు, బీన్స్, టమాట, అరటిపండ్లు, వెల్లుల్లి, తృణధాన్యాలు వంటివాటిలో ప్రీబయాటిక్స్ ఉంటాయని వారు చెబుతున్నారు.
పర్వత పుత్రుల విజయ రహస్యం ఏమిటి?
సముద్రమట్టం నుంచి ఎత్తు పెరిగే కొద్దీ గాలిలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. దాంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుంది. పర్వతారోహకులకు అతిపెద్ద అడ్డంకి ఇది. మరి ‘పర్వతప్రాంతాల్లో నివసించేవారి పరిస్థితి ఏమిటి? వాళ్ళ శరీరాలు అక్కడి వాతావరణానికి, పీడనకూ ఎలా అలవాటు పడతాయి?’ అన్న సందేహాలు పరిశోధకులకు కలిగాయి. దాంతో వారు సముద్రమట్టానికి 2,500 మీ. ఎత్తున నివసించేవారి జనాభా లెక్కలను సేకరించే పనిలో పడ్డారు. ఇలాంటివారు ఎనిమిది కోట్లమంది ఉన్నారని తేలింది. ప్రస్తుతానికి అంత ఎత్తులో ఉండే వారి శరీర నిర్మాణంలో వచ్చిన మార్పులను గమనిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఊపిరితిత్తులకు సంబంధించి మనం ఎదుర్కొనే సమస్యలకు వారి దగ్గర పరిష్కారం ఉందేమో కనుగొనే పనిలో వారు పడ్డారు. అంతేకాదు! గ్లోబల్ వార్మింగ్ వంటివి వీరి జీవితాలమీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.