జెనీవా: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహనం కోల్పోయారు. ఓ రిపోర్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ తర్వాత సదరు రిపోర్టర్కు బైడెన్ క్షమాపణ చెప్పారు. పుతిన్ తన ప్రవర్తనను మార్చుకుంటారని మీరు విశ్వాసంతో ఉన్నారా అని సీఎన్ఎన్ వైట్హౌజ్ కరెస్పాండెంట్ కైట్లాన్ కొలిన్స్ పదే పదే అడగటంతో బైడెన్ సీరియస్ అయ్యారు. నేను విశ్వాసంగా లేను. ప్రతిసారి ఎందుకిలా చేస్తారు? నేను కాన్ఫిడెంట్గా ఉన్నానని ఎప్పుడు చెప్పాను. నాకు దేనిపైనా నమ్మకంగా లేదు. మిగతా ప్రపంచమంతా రియాక్ట్ అయినప్పుడు, వారి స్థాయి తగ్గినప్పుడు వారి ప్రవర్తన మారుతుంది అని మాత్రమే నేను చెప్పాను అని సదరు రిపోర్టర్కు బైడెన్ చెప్పారు.
అయినా ఆమె మాత్రం పుతిన్ గురించి పదే పదే ప్రశ్నలు అడిగారు. ఆయన ప్రవర్తన మారలేదని, బైడెన్తో మీటింగ్ తర్వాత కూడా పుతిన్ సైబర్ అటాక్స్, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ప్రశ్నలకు సరిగా సమాధానం ఇవ్వలేదని సదరు రిపోర్టర్ అడిగారు. అలాంటప్పుడు ఇది నిర్మాణాత్మక భేటీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. దీనికి బైడెన్ సీరియస్గా స్పందిస్తూ.. అది మీకు అర్థం కాకపోతే నేనేమీ చేయలేను అని అన్నారు.
అయితే ఆ తర్వాత జెనీవా నుంచి వాషింగ్టన్కు తిరిగొచ్చే ముందు ఎయిర్ఫోర్స్ ఎక్కే సమయంలో మరోసారి రిపోర్టర్లతో మాట్లాడిన బైడెన్.. సదరు రిపోర్టర్కు క్షమాపణ చెప్పారు. అయితే మీరు ఎప్పుడూ సానుకూల ప్రశ్నలు అడగరు అని రిపోర్టర్లతో ఆయన అన్నారు.