పట్నా: బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు వీరాభిమాని తన ఆరాధ్య నేత ఆశీస్సుల కోసం ఏకంగా తన వెడ్డింగ్ కార్డుపై లాలూ ఫోటోతో పాటు ఆర్జేడీ సింబల్ ను ముద్రించాడు. వైశాలి జిల్లాకు చెందిన పవన్ కుమార్ యాదవ్ లాలూకు వీరాభిమాని. ఏప్రిల్ 23న యాదవ్ వివాహం కాగా వెడ్డింగ్ కార్డు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఎరుపు బంగారు వర్ణంలో ఉన్న పెండ్లి పత్రికపై బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఫోటో, ఆర్జేడీ సింబల్ ముద్రించగా, కింది భాగంలో వధూవరుల పేర్లున్నాయి.
పెండ్లి పత్రికను లాలూ భార్య, బిహార్ మాజీ సీఎం రబ్రీదేవీ, కుమారుడు తేజస్వి యాదవ్, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ లకు పంపానని వరుడు పవన్ కుమార్ యాదవ్ తెలిపాడు. లాలూ త్వరలో జైలు నుంచి విడుదలవుతారని, అప్పుడు ఆయన తమను ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా పశుగ్రాస కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ కు 2018లో న్యాయస్థానం 14 ఏండ్ల జైలు శిక్ష, రూ 60 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.