యాదాద్రి, మార్చి17: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజైన బుధవారం నాడు స్వామి ఆది అవతారమైన మత్స్యాలంకారంలో దర్శనమిచ్చాడు. సాయంత్రం శేష వాహనమేగి భక్తులను ఆశీర్వదించాడు. నిత్యపూజల అనంతరం స్వామివారికి మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలు వైభవంగా జరిపారు. గోవింద నామ స్మరణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య అర్చకబృందం నిత్యపూజలు, అలంకార సేవలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్. గీత, అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనారసింహాచార్యులు, మోహనాచార్యులు, యాజ్ఞీకులు శ్రీమాన్ ఉభయ వేదాంత శేషం ప్రణీతాచార్యులు, ఉప ప్రధానార్చకులు నరేంద్రాచార్యులు, రంగాచార్యులు, వెంకటాచార్యులు, శ్రీధరాచార్యులు, ఏఈవోలు శ్రవణ్కుమార్, రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు.
మత్స్యావతార అలంకార సేవ..
మహావిష్ణువు అవతారాలు వెలసి ఉన్న అన్ని ఆలయాల్లో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఓ అలంకార సేవ ఉంటుంది. వేడుకలు ముగిసే వరకు ఒక్కో రోజు ఒక్కో దశావతార రూపంలో అలంకరించడం సంప్రదాయంగా వస్తున్నది. అందులో భాగంగానే శ్రీ లక్ష్మీ నరసింహుడు బుధవారం మత్స్యావతారంలో దర్శనమిచ్చాడు. దశావతారాల పురాణాలు ప్రవచిస్తు న్నట్టుగా.. కల్పాంత సమయంలో బ్రహ్మ నిద్రించినప్పుడు జగత్ ప్రళయం సంభవించింది. ఆ సమయంలో హయగ్రీవుడనే రాక్షసుడు వేదాలను అపహరించాడు. శ్రీ మహా విష్ణువు మత్స్యావతారమెత్తి హయగ్రీవుడిని సంహరించి వేదములను తిరిగి బ్రహ్మవశం చేశాడు. అందుకే దశావతారములలో మొదటిదైన ఈ మత్స్యావతారం విశిష్టత సంతరించుకున్నది. వేద పండితులు విష్ణు సూక్తం. నారాయణ సూక్తం, పురుష సూక్తం, శ్రీ సూక్తం పారాయణ చేస్తుండగా శ్రీ నరసింహుడు మత్స్యాలంకారంలో ఊరేగి భక్తులకు కనువిందు చేశాడు.