బడ్జెట్లో సబ్బండ వర్గాల అభ్యున్నతి, అభివృద్ధికి ప్రాధాన్యం
విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం
జిల్లా, మండల పరిషత్లకు జీవం
కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు భారీగా నిధులు
కాళేశ్వరం ప్రాజెక్టు టూరిజం సర్క్యూట్ కింద 350కోట్లు
మానేరు రివర్ ఫ్రంట్కు 100 కోట్లు
రాజన్న క్షేత్ర అభివృద్ధికి 50 కోట్లు
వరదకాలువ లిఫ్ట్లకు 20.32 కోట్లు
కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్కు 7 కోట్లు
బడ్జెట్పై సకల జనుల హర్షాతిరేకాలు
ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి గంగుల
కరీంనగర్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):కరోనా కష్టాలు వెంటాడుతున్నా.. కేంద్రం తన వాటా ఇవ్వడంలో వివక్ష చూపుతున్నా.. రాష్ట్ర సర్కారు తన మాననీయ కోణాన్ని మరోసారి చాటుకున్నది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన ‘2021-22 బడ్జెట్’ సబ్బండ వర్గాల సంక్షేమానికి అద్దం పడుతున్నది. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పేరిట సరికొత్త ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టడంతోపాటు మత్స్యపరిశ్రమకు ఊతమిచ్చింది. గతంలో మాదిరిగానే అన్నదాతల అభ్యున్నతికి పెద్దపీట వేసి, రైతుబంధు, రైతుబీమా పథకాలకు మరిన్ని కేటాయింపులు చేసింది. పల్లెప్రగతికి ఇప్పటికే ప్రాణం పోసిన సర్కారు, మొదటిసారి జిల్లా, మండల పరిషత్లకు నిధులు ఇచ్చింది. ఆర్టీసీపై మరోసారి ఉదారతను చాటుకోవడంతోపాటు కేటాయింపుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు టూరిజం సర్క్యూట్ కింద 350 కోట్లు, మానేరు రివర్ ఫ్రంట్కు 100 కోట్లు, రాజన్న క్షేత్ర అభివృద్ధికి 50 కోట్లు, వరదకాలువ లిఫ్ట్లకు 20.32 కోట్లు, కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్కు 7 కోట్లను ప్రతిపాదించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. మొత్తంగా చూస్తే.. అన్ని వర్గాలకూ మేలు చేసేలా బడ్జెట్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు గురువారం శాసనసభలో ప్రవేశ పెట్టిన 2,30,825 కోట్ల 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రశంసలు అందుకుంటున్నది. ఓ వైపు కరోనాతో ఆర్థిక స్థితిగతులు తలకిందులైనా.. కేంద్రం నుంచి గ్రాంటు రాకపోయినా.. సర్కారు మాత్రం మానవీయ కోణాన్ని చాటింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో గతంలో మాదిరిగానే అన్నివర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసి, నిధుల వరద పారించారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలకు ప్రాధాన్యమినిచ్చారు. రైతుబీమా, రైతుబంధు పథకాలకు యథావిధిగా నిధులు కేటాయించారు. అలాగే కునారిల్లిన జిల్లా, మండల పరిషత్లకు మొదటిసారిగా బడ్జెట్లో నిధులు ఇచ్చారు. షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రగతికి భారీ కేటాయింపులు చేశారు. ఈ మేరకు అవిభక్త ఉమ్మడి జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరం రెండు శాఖలకు కలిపి సుమారు 2,400 కోట్ల నిధులు వచ్చే అవకాశముంది. అలాగే, గ్రామాల అభివృద్ధికి 29,271 కోట్లు సర్కారు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలో 1,214 పంచాయతీలుండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 600 కోట్లకుపైగా నిధులు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రగతి బాట పట్టిన పల్లెలు, ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే నిధులతో మరింత అభివృద్ధి చెందుతాయి. మొత్తంగా సంక్షేమంతోపాటు అభివృద్ధికి పెద్దపీట వేయగా, బడ్జెట్ను ప్రతి ఒక్కరూ స్వాగతించారు. సబ్బండ వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా ఉందని చెప్పారు.
పుష్కలంగా మత్స్య సంపద..
గోదావరిని సజీవంగా.. వరదకాలువను రిజర్వాయర్గా మార్చడం.. శ్రీరాజరాజేశ్వర జలాశయం, లోయర్ మానేరు డ్యాంను నిండుకుండలా ఉంచడం వల్ల ఇప్పటికే మత్స్య పరిశ్రమ ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’గా వర్ధిల్లుతున్నది. తాజా బడ్జెట్లో పశుపోషణ, మత్స్య శాఖకు 1730 కోట్లు ప్రతిపాదించింది. ఉమ్మడి జిల్లాలో 680 మత్స్య కారుల సహకార సంఘాలుండగా.. వీటి పరిధిలో 1,800 చెరువులున్నాయి. ఇవే కాకుండా గ్రామ పంచాయతీల పరిధిలో మరో 2,600 కుంటలున్నాయి. వీటితోపాటు శ్రీరాజరాజేశ్వర, దిగువమానేరు జలాశయాల్లో ప్రస్తుతం 9 కోట్ల చేపపిల్లలను, రెండు కోట్ల రొయ్య పిల్లలను పెంచుతున్నారు. ఈ బడ్జెట్లో మరింత ఊతం ఇవ్వడం.. ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా నీటి సౌలభ్యం పెరిగిన నేపథ్యంలో.. పది లక్షలకుపైగా చేపపిల్లలను, మూడు కోట్ల వరకు రొయ్య పిల్లలను పెంచే అవకాశం ఏర్పడుతున్నది. దీని వల్ల ఉమ్మడి జిల్లాలోని మత్స్యకారుల ముఖచిత్రం పూర్తిగా మారనున్నది.
జలకళ..
ఉమ్మడి జిల్లా ఇప్పటికే వాటర్ హబ్లా మారింది. కాళేశ్వరం ఎత్తిపోతలతో ఎక్కడ చూసినా పుష్కలంగా నీళ్లు కనిపిస్తున్నాయి. తాజా బడ్జెట్లో సర్కారు సాగు, నీటిపారుదల శాఖకు 16,931 కోట్లు కేటాయించింది. ఉమ్మడి జిల్లాకు భారీగా నిధులు వచ్చే అవకాశమున్నది. గండిపల్లి, గౌరవెల్లి వంటి జలాశయాలు, శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్టు కుడి కాలువ పనులు, కాకతీయ కెనాల్కు పూర్తిస్థాయి మరమ్మతులు, ఇంకా మిగిలిపోయిన చెరువులు వంటివి ఈ యేడాదిలో పూర్తయ్యే అవకాశమున్నది. మానేరుపై ప్రతిపాదించిన చెక్ డ్యాంలు కూడా పూర్తయ్యే చాన్స్ ఉన్నది. మరోవైపు వరదకాలువ పొడవునా తూములు పెట్టి ఆయకట్టుకు సాగునీరు అందించడం, కొత్తగా లిఫ్టులు ఏర్పాటు చేయడం.. అలాగే, ఉమ్మడి జిల్లాలోని అనేక వాగులపై చెక్ డ్యాంల నిర్మాణాలు ఈ యేడాది పూర్తి చేసుకోవడానికి తాజా బడ్జెట్ దోహద పడుతుంది.
6లక్షలకుపైగా రైతులకు లబ్ధి..
రైతన్నపై సర్కారు మరోసారి తన ప్రేమను చాటింది. రైతుబంధు కింద 14,800 కోట్లను ఈ బడ్జెట్లో ప్రతిపాదించింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 6.01 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముండగా.. 600 కోట్ల మేరకు లబ్ధి పొందనున్నారు. రైతు బీమా కింద 1200 కోట్లు ప్రతిపాదించారు. నిజానికి ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 422 కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. ప్రస్తుత కేటాయింపులు భవిష్యత్తుకు భరోసా ఇవ్వనుండగా, రుణమాఫీ కింద సుమారు 4.77 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నది.
ఆర్టీసీకి ఊహించని మేలు
సీఎం కేసీఆర్ సార్ ఆర్టీసీకి ఇంత పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తారని ఊహించలేదు. సమ్మె, కరోనా కాలంలో ఆదాయం కోల్పోయిన సంస్థను గట్టెక్కించేందుకు ప్రతి ఉద్యోగి శ్రమిస్తున్నారు. కరోనా సమయంలో జీతాలు రావని భయపడ్డాం. కేసీఆర్ పెద్ద మనసుతో మా కష్టాలను తెలుసుకొని జీతాలను ఇప్పించిన్రు. ఇప్పుడు బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయిస్తరని ఊహించలేదు. చాలా సంతోషంగ ఉంది. ఈ నిధులతో సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకుంటది.కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
విద్యుత్ వెలుగులు..
ఇప్పటికే 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్లో 11,046 కోట్లను ప్రతిపాదించింది. ఉమ్మడి జిల్లాలో నీటి సౌలభ్యం పెరుగడం.. అలాగే, గోదావరి జలాల ఎత్తిపోతలకు సంబంధించి విద్యుత్ వాడకం పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోనే అత్యధిక వినియోగం ఉమ్మడి జిల్లా
వ్యాప్తంగా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అలాగే, మరింత మెరుగైన విద్యుత్ను వ్యవసాయానికి అందించేందుకు ప్రతిపాదనలు పంపారు. తాజా, బడ్జెట్ కేటాయింపులను చూస్తే ఉమ్మడి జిల్లాకు అధిక లబ్ధి చేకూరనున్నది.
పరిశ్రమలకు ప్రోత్సాహం..
టీఎస్ ఐపాస్ ద్వారా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, ఈసారి బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి 3,077 కోట్లను ప్రతిపాదించింది. టీఎస్ ఐపాస్ వచ్చిన తర్వాత జిల్లాలకు భారీగా పరిశ్రమలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 822 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. దీనికింద 300.35 కోట్ల పెట్టుబడులు పెట్టి, 6,322 మందికి ఉపాధి కల్పించారు. ప్రధానంగా గ్రానైట్ పరిశ్రమలు, రైస్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కొత్త తరహా ఇటుక తయారీ పరిశ్రమలు, టెక్స్టైల్ రంగానికి సంబంధించిన పరిశ్రమలు వంటివి వెలుస్తున్నాయి. తాజాగా, ప్రతిపాదించిన బడ్జెట్ ద్వారా భారీ ఇన్సెంటివ్ రావడానికి ఆస్కారమున్నది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు భారీగా పెరిగే అవకాశమున్నది.
మొదటిసారి పరిషత్లకు నిధులు..
పల్లె ప్రగతి పేరుతో పంచాయతీలకు జీవం పోసిన సర్కారు.. తాజాగా బడ్జెట్లో జిల్లా, మండల పరిషత్లకు రాష్ట్రవ్యాప్తంగా 500 కోట్ల నిధులను ప్రతిపాదించారు. జిల్లా పరిషత్లకు 252 కోట్లు, మండల పరిషత్లకు 248 కోట్లు కేటాయించారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాకు సుమారు 15 కోట్ల నుంచి 20 కోట్లకుపైగా నిధులు వచ్చే అవకాశమున్నది. మొదటిసారి భారీగా నిధులు కేటాయించడంపై జడ్పీ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంతోపాటు ఎల్లారెడ్డిపేట, పెద్దపల్లి, ధర్మారంలో సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. పెద్దపల్లి జడ్పీ కార్యాలయ ఆవరణలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు, వైస్ చైర్మన్ మండిగ రేణుక, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.