మీరు, మీ సేవలు అద్భుతం..
అమెరికాపై భారతీయుల పట్టు పెరుగుతున్నది
నా ప్రసంగ రచయిత వినయ్రెడ్డి, ఉపాధ్యక్షురాలు
కమలా హ్యారిస్.. నాసా మార్స్ సక్సెస్లోనూ మీరే
సైంటిస్ట్ స్వాతిమోహన్పై బైడెన్ ప్రశంసలు.. నాసా శాస్త్రవేత్తలతో ముచ్చట
వాషింగ్టన్, మార్చి 5: అగ్రరాజ్యం అమెరికాపై భారత సంతతి పట్టు సాధిస్తున్నదని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసాపూర్వకంగా వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వ యంత్రాంగంలో గణనీయ సంఖ్యలో భారత సంతతి నిపుణులకు చోటు దక్కడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 50 రోజులలోపే దాదాపు 57 మంది ఇండియన్ అమెరికన్లకు బైడెన్ తన యంత్రాంగంలో కీలక నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. గత నెల 18న అమెరికాకు చెందిన పెర్సవరెన్స్ రోవర్ విజయవంతంగా మార్స్పై అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ మిషన్లో పాలుపంచుకున్న నాసా శాస్త్రవేత్తలతో ఆయన గురువారం వర్చువల్ మాధ్యమంలో ముచ్చటించారు. మార్స్ మిషన్ గైడెన్స్, కంట్రోల్ ఆపరేషన్స్కు భారత సంతతికి చెందిన స్వాతిమోహన్ నేతృత్వం వహించారు. ఈ విషయాన్ని బైడెన్ ప్రముఖంగా ప్రస్తావించారు. ‘అమెరికాపై భారత సంతతి వ్యక్తుల పట్టు పెరుగుతున్నది. మీరు (స్వాతిమోహన్), దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, నా ప్రసంగ రచయిత వినయ్రెడ్డి అందరూ ఇండియన్ అమెరికన్లే. మీరు అద్భుతం’ అని ప్రశంసించారు. అమెరికా చరిత్రలో ఇప్పటివరకూ ఒబామా హయాంలో అత్యధిక మంది భారతీయ అమెరికన్లకు ప్రభుత్వంలో కీలక పదవులు లభించాయి. దీనిని కొనసాగిస్తూ బైడెన్ సర్కారు తక్కువ రోజుల్లోనే అత్యధిక మందికి కీలక బాధ్యతలు అప్పగించింది. వీరిలో సగం మంది మహిళలే కావడం విశేషం. మార్స్ ప్రయోగం విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలను బైడెన్ అభినందించారు. సైంటిఫిక్ లీడర్గా అమెరికా ప్రతిష్ఠ మసకబారుతున్న తరుణంలో ఈ విజయం గొప్ప విశ్వాసాన్ని అందించిందని చెప్పారు.
మార్స్ ప్రయోగం కలలా ఉంది: స్వాతిమోహన్
చిన్నతనంలో టెలివిజన్లో ‘స్టార్ట్రెక్’ ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పటి నుంచి నాసాలో చేరాలన్న ఆసక్తి కలిగిందని స్వాతిమోహన్.. బైడెన్తో పేర్కొన్నారు. నాసా జెట్ప్రొపల్సన్ ల్యాబొరేటరీలో పెర్సవరెన్స్ తన తొలి ప్రాజెక్టు అని, తొలి నుంచి అందులో భాగంగా ఉన్నానని చెప్పారు. మార్స్పై రోవర్ దిగే చివరి క్షణాలు అత్యంత ఉత్కంఠభరితంగా గడిచాయని, రోవర్ దిగడం, మార్స్ ఫొటోలను పంపడం చూస్తే కలలా ఉన్నదని పేర్కొన్నారు.
బైడెన్ యంత్రాంగంలో కీలక పదవులు దక్కించుకున్న ఇండియన్ అమెరికన్లు
- కమలాహ్యారిస్ – ఉపాధ్యక్షురాలు
- వివేక్మూర్తి – సర్జన్ జనరల్
- వనితా గుప్తా – అసోసియేట్ అటార్నీ జనరల్
- వినయ్రెడ్డి – బైడెన్ ప్రసంగ రచయిత
- ఉజ్రాజయ – అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ సివిలియన్ సెక్యూరిటీ, డెమోక్రసీ, హ్యూమన్రైట్స్
- భరత్ రామమూర్తి -జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్
- గౌతమ్ రాఘవన్ – అధ్యక్ష కార్యాలయ సిబ్బంది డిప్యూటీ డైరెక్టర్
- మాలా అడిగి -బైడెన్ భార్య జిల్కు విధాన సలహాదారు
- గరిమా వర్మ – జిల్ బైడెన్కు డిజిటల్ డైరెక్టర్
- తరుణ్ చాబ్రా – టెక్నాలజీ, నేషనల్ సెక్యూరిటీ సీనియర్ డైరెక్టర్
- సుమన గుహ -దక్షిణాసియా, జాతీయ భద్రతా మండలి సీనియర్ డైరెక్టర్
- శాంతి కళాతిల్ – ప్రజాస్వామ్యం, మానవహక్కుల కోఆర్డినేటర్
- సోనియా అగర్వాల్ – పర్యావరణ విధాన సలహాదారు
- సబ్రినా సింగ్ – ఉపాధ్యక్షురాలికి డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ
- అయేషా షా -వైట్హౌస్ డిజిటల్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్ మేనేజర్
- సమీరా ఫాజిల్ -జాతీయ ఆర్థికమండలి డిప్యూటీ డైరెక్టర్
- వేదాంత్ పటేల్ – అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ
- విదుర్ శర్మ – కొవిడ్ టెస్టింగ్ అడ్వైజర్
- నేహా గుప్తా – అసోసియేట్ కౌన్సెల్
- రీమా షా -డిప్యూటీ అసోసియేట్ కౌన్సెల్
- రోహిత్ చోప్రా – కన్జూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో డైరెక్టర్