వీడియోను విడుదల చేసిన ఉగ్రవాద సంస్థ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఎప్పుడో చనిపోయాడనుకున్న అల్ఖైదా చీఫ్ అయ్మన్ అల్ జవహరీ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. అమెరికాపై 9/11 ఉగ్రదాడి జరిగి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా అల్ఖైదా ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో జవహరీ కనిపించాడు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపించిన అతడు పలు అంశాలపై మాట్లాడాడు. 20 ఏండ్ల యుద్ధం తర్వాత అమెరికా చెల్లాచెదురై అఫ్గానిస్థాన్ నుంచి నిష్క్రమిస్తుందని అతడు పేర్కొన్నాడు. తాలిబన్లు అఫ్గాన్ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడాన్ని ప్రస్తావించలేదు. సిరియాలోని రష్యా సైనిక స్థావరంపై అల్ఖైదా అనుబంధ సంస్థ జరిపిన దాడిని ప్రస్తావించాడు. ఈ దాడి ఈ ఏడాది జనవరిలో జరిగింది. దీనిబట్టి ఈ వీడియో ఇప్పుడు రికార్డు చేసిందికాకపోవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు గంట నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.