9/11 attack: చనిపోయాడనుకున్న అల్ఖైదా చీఫ్ అయ్మాన్ అల్-జవహిరి బతికే ఉన్నాడు. తాజాగా 9/11 దాడి జరిగి 20 ఏళ్ల పూర్తయిన సందర్భంగా అతడు ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. అల్ఖైదా అధికారిక మీడియా అస్-సహబ్ ఈ 60 నిమిషాల వీడియోను పోస్ట్ చేసింది. ఒసామా బిన్ లాడెన్ను అమెరికా మట్టుబెట్టిన తర్వాత అల్ఖైదా బాధ్యతలు తీసుకున్న జవహిరి.. చాలాకాలంగా అండర్గ్రౌండ్లోనే ఉన్నాడు. గతేడాది నవంబర్లో అతడు అనారోగ్యంతో మరణించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అతని నుంచి వీడియో బయటకు రావడం ఇదే తొలిసారి.
శనివారం విడుదలైన ఈ వీడియోలో జవహిరి పూర్తి ఆరోగ్యంతో కనిపించాడు. సెప్టెంబర్ 11 ఉదయం నుంచీ కొన్ని టెలిగ్రామ్ చానెళ్లలో ఈ వీడియో వస్తోందంటూ అస్-సహబ్ ప్రోమోలు నడిపించింది. ఆ తర్వాత ఓ టెలిగ్రామ్ చానెల్ ద్వారానే జవహిరి రాసిన 852 పేజీల బుక్ను రిలీజ్ చేసింది అల్ఖైదా. ఈ 60 నిమిషాల వీడియోలో ఒక్కచోట మాత్రమే అతడు ఆఫ్ఘనిస్థాన్ గురించి ప్రస్తావించాడు. 20 ఏళ్ల యుద్ధం తర్వాత అమెరికా పూర్తిగా కుంగిపోయి మళ్లీ ఇంటిదారి పట్టిందని అన్నాడు. 9/11 దాడుల్లో పాల్గొన్న 19 మంది అల్ఖైదా ఉగ్రవాదులను అతడు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.