కర్జాయ్ విమానాశ్రయం సమీపంలో రాకెట్ దాడులు
కాబూల్, ఆగస్టు 29: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబులతో దద్దరిల్లింది. నగరంలోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయానికి సమీపంలోని ఓ ఇంటి మీద రాకెట్ దాడి జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నది. రానున్న 24-36 గంటల్లో కాబూల్ పరిసరాల్లో ఉగ్రదాడులు జరుగొచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరుగడం గమనార్హం. అమెరికా సైనికులే లక్ష్యంగా జరిగినట్టు భావిస్తున్న ఈ దాడుల వెనుక ఐసిస్-కే హస్తం ఉన్నట్టు అనుమానం. మరోవైపు, కాబూల్ విమానాశ్రయంలో బాంబులు పేల్చేందుకు సూసైడ్ బాంబర్లతో వస్తున్న ఓ వాహనంపై అమెరికా దళాలు ఆదివారం సాయంత్రం డ్రోన్ దాడులు జరిపాయి. ఈ దాడుల్లో దుండగులు మరణించినట్టు సమాచారం. ఐసిస్-కే ఉగ్రవాదులుగా భావిస్తున్న ఈ దళ సభ్యులు.. అమెరికా సైనికులే లక్ష్యంగా ఈ కుట్ర పన్నినట్టు తెలుస్తున్నది.
మహిళలు మాట్లాడొద్దు!
కాందహార్లో సంగీతం, టీవీలు, రేడియోల్లో మహిళలు మాట్లాడటంపై తాలిబన్లు నిషేధం విధించారు. కొన్ని సోషల్ మీడియా సంస్థలు మహిళా యాంకర్లను తొలగించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. మరోవైపు, అఫ్గానిస్థాన్కు చెందిన జానపద గాయకుడు ఫవాద్ను తాలిబన్లు కాల్చి చంపారు. కారణం తెలియరాలేదు. కాబూల్ ఉగ్రదాడికి పాల్పడ్డ ఐసిస్-కే గ్రూప్లో కేరళకు చెందిన 14 మంది ఉన్నారని సమాచారం. అఫ్గానిస్థాన్కు చెందిన రెండు వేల మంది జర్నలిస్టులు దేశం విడిచి వెళ్తామని అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరేషన్కు దరఖాస్తు చేసుకొన్నారు. కాగా అఫ్గాన్ను వీడాలనుకున్న వారిని ఈ నెల 31 తర్వాత కూడా అనుమతిస్తామని తాలిబన్లు ప్రకటించారు.
‘తాలిబన్’ను ప్రస్తావించని ఐరాస
అఫ్గాన్ పాలకులుగా తాలిబన్లను ప్రపంచం అధికారికంగా గుర్తించనుందా.. దౌత్యపరంగా వారి వ్యూహాలు ఫలిస్తున్నాయా.. అంటే అవుననే తెలుస్తున్నది. కాబూల్ ఉగ్రదాడి ఘటనపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ‘తాలిబన్’ పేరును ప్రస్తావించలేదు. ‘అఫ్గాన్ గ్రూపులు ఉగ్రవాదులకు సహకరించకూడదు’ అని మాత్రమే పేర్కొన్నది. ఇదే భద్రతా మండలి.. తాలిబన్లు కాబూల్ను ఆక్రమించుకొన్న మరుసటి రోజు (ఆగస్టు 16) చేసిన ప్రకటనలో ‘తాలిబన్లు కానీ, మరే ఇతర అఫ్గాన్ గ్రూపులు కానీ ఉగ్రవాదులకు సహకరించకూడదు’ అని చెప్పుకొచ్చింది. కేవలం 15 రోజుల్లోనే భద్రతా మండలి వైఖరిలో మార్పు.. తాలిబన్ల దౌత్యపరమైన విజయమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత్కు సవాలే: రాజ్నాథ్
అఫ్గానిస్థాన్లో వేగంగా మారుతున్న సమీకరణాలు భారత్కు సవాలేనని కేంద్రప్రభుత్వం పేర్కొంది. అక్కడి పరిణామాల దృష్ట్యా భారత్ కూడా భద్రతా వ్యూహాలపై పునరాలోచించుకోవాల్సి వచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కొత్త వ్యూహాల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ల(ఐబీజీ) ఏర్పాటును పరిశీలిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు, అమెరికా బలగాల ఉపసంహరణ, అఫ్గాన్ సైనికులు తేలిగ్గా లొంగిపోవడంతో తాలిబన్లకు భారీ ఎత్తున ఆయుధాలు లభించాయి. తాలిబన్ల వద్ద 167 హెలికాప్టర్లు ఉన్నట్టు ఉపగ్రహచిత్రాల అధారంగా తేలింది. ఓ యుద్ధ విమానంతో పాలు పలు విమానాలు వారి హస్తగతం అయినట్టు తెలిసింది.