సిద్దిపేట కలెక్టరేట్, ఏప్రిల్16: నయా పైసా ఖర్చు లేకుండా జిల్లాలో అత్యంత పారదర్శకంగా ధరణి ద్వారా భూ సమస్యలను పరిష్కరిస్తామని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట పెండింగ్ భూ సమస్యలపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణిలో ఇప్పటివరకు మ్యుటేషన్లు సేల్స్ ఆధార్ సీడింగ్, డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ వివిధ అంశాలకు సంబంధించి అన్ని కలిపి ఇప్పటివరకు 241 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్కు వివరించారు. ఇందులో భాగంగా ప్రాపర్టీ సేల్కు సంబంధించి 12,029, గిప్ట్ డీడీలకు సంబంధి 2975, పెండింగ్ మ్యుటేషన్ 10298, ఆధార్ సీడింగ్కు సంబంధించి 256, ఎన్ఆర్ఐలు , గ్రీవెన్స్ మాడ్యూల్లో 3346 మంది ఆర్జీలు పెట్టుకున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి వచ్చే ఆదివారం సాయంత్రం నాటికి పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్కు వివరించారు. ధరణిలో వచ్చే దరఖాస్తులను ఏప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక ధరణి సెల్ను ఏర్పాటు చేస్తామన్నారు. దీని నిర్వహణకు ప్రత్యేకంగా ముగ్గురు రెవెన్యూ అధికారులను నియమిస్తామన్నారు. ఏలాంటి తప్పులు జరుగకుం డా చూస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా సేవలను అందిస్తామన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా 5 వేల కోట్ల నష్టపరిహారం చెల్లించి సుమారు 50 వేల ఎకరాల భూసేకరణ చేస్తామన్నారు. ఆయా రైతుల భూ మార్పిడి, మ్యుటేషన్ ప్రక్రియలకు త్వరలోనే ప్రణాళికను రూపొందించి పరిష్కారం చూపిస్తామన్నారు.
గ్రీవెన్స్ మాడ్యూల్తో సమయం ఆదా..
సీఎం కేసీఆర్ ఆదేశాలతో గ్రీవెన్స్ మాడ్యూల్ వచ్చిందని భూ సమస్యలను వేగంగా పరిష్కరమవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రైతులు మీ సేవాకేంద్రాల్లో దరఖాస్తు నేరుగా కలెక్టర్ కంప్యూటర్కు సంబంధిత ఆర్జీ వస్తుందన్నారు. క్షేత్ర స్థాయి అధికారుల ద్వారా కేవలం 48 గంటల్లోనే సమస్యను పరిష్కార నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగాల్సి పని లేదన్నారు. జిల్లాలో 15 వేల భూ సమస్యలు ఉన్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. ఒక్కసారి ధరణిలో రైతుల వివరాలు వచ్చిన తర్వాత వాటిని మార్చే అధికారం జిల్లా స్థాయిలో అధికారికి సైతం లేదన్నారు. వేగంగా, పారదర్శకంగా దరణి ద్వారా రైతులకు భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ధరిణి మొట్ట మొదటిసారిగా దేశంలో ప్రథమంగా తెలంగాణ ప్రభుత్వం ఆరంభించిందన్నారు. ఇలాంటి పోస్టల్ దేశంలో ఎక్కడా లేదని రైతుల సౌకర్యార్థం సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ్దతో రూపకల్పన చేశారని తెలిపారు. మూడు నెలల్లో భూ సమస్యల పరిష్కారానికి జిల్లా యాంత్రాంగం మరింత వేగంగా పనిచేస్తుందన్నారు. ఇప్పటికే జిల్లాలో 28 వేల 241 మంది రైతులు ధరణి సేవలను వినియోగించుకున్నారని తెలిపారు.