బెర్లిన్: ఆప్ఘనిస్తాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ మొదలైన విషయం తెలిసిందే. దీన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ తప్పుపట్టారు. నాటో దళాలు వెనక్కి వెళ్లడం వల్ల .. ఆఫ్ఘన్ పౌరులను తాలిబన్లకు వదిలేసినట్లు అవుతుందన్నారు. ఆ ప్రజల్ని తాలిబన్లు నరికేస్తారని జార్జ్ బుష్ హెచ్చరించారు. ఆఫ్ఘనీ మహిళలు, అమ్మాయిలు.. చెప్పలేనటువంటి కష్టాలను ఎదుర్కొంటారని, ఇది పొరపాటు అని, చాలా క్రూరమైన తాలిబన్లు వాళ్లను హతమారుస్తారని, ఇది తన గుండెను కలిచివేస్తోందని జార్జ్ బుష్ తెలిపారు. 2001లో అమెరికాపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆ నాటి అధ్యక్షుడైన బుష్ ఆఫ్ఘనిస్తాన్కు దళాలను పంపారు. జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్ కూడా నాటో దళాల ఉపసంహరణను వ్యతిరేకిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న నాటో దళాలు.. సెప్టెంబర్ 11వ తేదీ లోపు పూర్తిగా ఉపసంహరించనున్నాయి.