కాబూల్: మరోసారి తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన ఆఫ్ఘనిస్థాన్లో అంతర్యుద్ధం (సివిల్ వార్) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికా టాప్ మిలిటరీ జనరల్ అంచనా వేశారు. ‘నా సైనిక అంచనా ప్రకారం ఆఫ్ఘనిస్థాన్లోని పరిస్థితులు అంతర్యుద్ధానికి దారి తీసే అవకాశం ఉన్నది’ అని యూఎస్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ మార్క్ మిల్లీ శనివారం ఫాక్స్ న్యూస్తో అన్నారు. ఇంకా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని తాలిబన్, అధికారాన్ని నిలబెట్టుకోవడం, సమర్థవంతమైన పాలనను అందించడంపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ‘విస్తృత సివిల్ వార్కు చాలా అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. అల్-ఖైదా పునర్నిర్మాణం, ఐఎస్ఐఎస్ లేదా ఇతర ఉగ్రవాద సమూహాల పెరుగుదల పరిస్థితులకు అది దారి తీయవచ్చు’ అని మిల్లీ చెప్పారు. ఇది వెంటనే జరుగకపోయినా.. ఏడాది, రెండేండ్లు లేదా మూడేండ్లలో అలాంటి పరిస్థితులు ఉండవచ్చన్నారు.
కాగా, ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాలు పూర్తిగా వైదొలగక ముందే కొన్ని ఉగ్రవాద సంస్థల సహకారంతో తాలిబన్లు మెరుపువేగంతో ఆఫ్ఘన్ సైన్యాన్ని ఓడించి, ఒకదాని తర్వాత ఒకటి ప్రావిన్సులను చివరికి కాబూల్ను స్వాధీనం చేసుకున్న తీరుపై అమెరికాతోపాటు ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. ఒకపక్క అహ్మద్ మసౌద్, మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ నాయకత్వం వహిస్తున్న తాలిబాన్ వ్యతిరేక దళాలు పంజ్షీర్ చేజారకుండా పోరాడుతున్నాయి. మరోపక్క తాలిబాన్-హక్కానీ మధ్య అధికార పోరు తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటులో తాలిబన్లు జాప్యం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటును రెండు సార్లు వాయిదా వేశారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ను మెరుపు వేగంతో ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు అధికారంలోకి రావడం అంత సజావుగా జరుగదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇది ఆయా గ్రూపుల మధ్య సివిల్ వార్కు దారి తీయవచ్చని విశ్లేషిస్తున్నారు.