కాబుల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ ప్రభుత్వం మహిళల హక్కులను పరిరక్షించాలని అక్కడి మహిళలు ( Afghan Women ) డిమాండ్ చేశారు. ఈ మేరకు పశ్చిమ హెరాత్ రాష్ట్రంలోని గవర్నర్ కార్యాలయం ఎదుట కొందరు మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కొత్త ప్రభుత్వంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలని, క్యాబినెట్లోనూ, పెద్దల సభలోనూ అవకాశాలు ఇవ్వాలని ప్రదర్శనకు నేతృత్వం వహించిన ఫ్రిబా కబ్జానీ డిమాండ్ చేశారు.
”తాలిబన్లు మీడియాలో అందమైన ఉపన్యాసాలు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం హింసిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. మహిళలపై వారు మళ్లీ దాడి చేశారు. అందుకు మేమే ప్రత్యక్ష సాక్షులం. మా నోళ్లు మూయించాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. కానీ, మేము మౌనంగా కూర్చోం. మా హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం ” అని సదరు మహిళలు స్పష్టం చేశారు.