కాబూల్, ఆగస్టు 13: ఆఫ్ఘనిస్తాన్లో భద్రతా దళాలపై భీకర దాడులకు తెగబడుతూ ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న తాలిబన్ ఉగ్రవాదులు తాజాగా రాజధాని కాబూల్ను సమీపించారు. ఇప్పటికే 18 ప్రావిన్షియల్ రాజధానులను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు… కొన్ని గంటల్లో కాబూల్ను హస్తగతం చేసుకోనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో తాలిబన్లకు అధికారం అప్పగించి, తప్పుకోవాలని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. అధికారాన్ని పంచుకుందామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తాలిబన్లు కొట్టిపారేశారు. దీంతో తాలిబన్లు వెంటనే దాడులు ఆపేలా శాంతి చర్చల కమిటీ కొత్త ప్రతిపాదనను రూపొందిస్తున్నది. దాని ప్రకారం… ఘనీ గద్దె దిగిపోతారు. తాలిబన్లు, వార్లార్డ్స్, కొందరు ప్రస్తుత ప్రతినిధులతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. దీనిపై శనివారంలోపు ఘనీ ఒక ప్రకటన చేయనున్నారని తెలిసింది. ఆఫ్ఘనిస్తాన్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ భూభూగం తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. వాటిలో 18 ప్రావిన్షియల్ రాజధానులు కూడా ఉన్నాయి. శుక్రవారం కూడా పలు నగరాలను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. కాబూల్కి 50 కిలోమీటర్ల దూరంలోని లొగర్ ప్రావిన్సు రాజధానిని ఆధీనంలోకి తీసుకున్నారు.
బలప్రయోగంతో వచ్చే ప్రభుత్వాన్ని గుర్తించం
ఆఫ్ఘనిస్థాన్లో బలప్రయోగంతో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వాన్ని గుర్తించబోమని భారత్తో పాటు జర్మనీ, ఖతార్, టర్కీ తదితర దేశాలు స్పష్టం చేశాయి. ఆఫ్ఘన్లో హింస, దాడులను వెంటనే ఆగాలని సూచించాయి. ఈ మేరకు ఆఫ్ఘన్పై దోహాలో రెండు సమావేశాల అనంతరం శుక్రవారం ఖతార్ ఒక ప్రకటనను జారీ చేసింది. ఆఫ్ఘన్లో శాంతి ప్రక్రియ వేగవంతం కావాల్సి ఉందని చర్చలో పాల్గొన్న దేశాలు అభిప్రాయపడినట్టు తెలిపింది.