కాబూల్ : తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan ) ఉక్కిరిబిక్కిరవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేసి తన కుటుంబంతో కలిసి దేశం విడిచి వెళ్లనున్నట్లు వార్తలు వ్యాపించాయి. అయితే ఆ వార్తలకు భిన్నంగా ఇవాళ ఘనీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. దేశ భద్రతా దళాలను పునరుత్తేజం చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. ఓ వీడియో ద్వారా సందేశం ఇచ్చిన ఘనీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెక్యూర్టీ, రక్షణ దళాలను బలోపేతం చేయాలని, ఆ దిశగా చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అస్థిరతను ఆపేస్తామన్నారు. అమెరికా సేనలు ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఒక్కొక్క నగరాన్ని తమ హస్తగతం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ దేశంలో రెండవ అతిపెద్ద పట్టణమైన కాందహార్ .. తాలిబన్ల వశమైంది. ప్రస్తుతం తాలిబన్ ఫైటర్.. కాబూల్ సరిహద్దుల్లో పాగా వేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వాళ్లు రాజధాని కాబూల్ను కూడా స్వాధీనం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో వైపు ఆ నగరంలో ఉన్న విదేశీ కార్యాలయాలను మూసివేస్తున్నారు. వాటిల్లో పనిచేసే సిబ్బందిని ఆయా దేశాలకు తరలిస్తున్నారు.