కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ బలగాలు నార్తర్న్ బాల్ఖ్ ప్రావిన్స్లో ఉగ్రవాదులే లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల్లో 81 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం హెలిక్యాప్టర్ గన్షిప్లు, యుద్ధవిమానాలతో ఆఫ్ఘన్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీ ఒక ప్రకటన వెలువరించింది. శనివారం మధ్యాహ్నం కల్దార్, చమ్తాల్ జిల్లాల్లో వైమానిక దాడులు మొదలయ్యాయని, ఈ దాడుల్లో 81 మంది ఉగ్రవాదులు హతమవడంతోపాటు, మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆర్మీ తన ప్రకటనలో పేర్కొన్నది.
అదేవిధంగా ఉగ్రవాదులకు సంబంధించిన 20కి పైగా వాహనాలను, బైకులను కూడా వైమానిక దాడుల్లో ధ్వంసం చేసినట్లు ఆర్మీ ప్రకటించింది. కాగా, ఆఫ్ఘనిస్థాన్లోని దాదాపు 200 జిల్లాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇటీవల తాలిబన్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు తాలిబన్లు ఎలాంటి కామెంట్ చేయలేదు.